
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 100 సెంచరీల ఘనతను అందుకోవాలంటే టీ20 ఫార్మాట్కు దూరంగా ఉండాలని పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ సూచించాడు. టీ20 ఫార్మాట్ను వదిలేసి టెస్ట్లు, వన్డేలపై మాత్రమే ఫోకస్ పెట్టాలన్నాడు. టీ20 ఫార్మాట్లో ఆటగాళ్ల శక్తి చాలా వృథా అవుతందని, అది క్రికెటర్ల కెరీర్పై ప్రభావం చూపుతుందని అక్తర్ చెప్పుకొచ్చాడు. తాజాగా స్పోర్ట్స్ తక్తో మాట్లాడిన అక్తర్.. విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఒక క్రికెటర్కు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. నా అభిప్రాయం ప్రకారం టీ20 ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ ఎంత త్వరగా తప్పుకుంటే అంత మంచిది. టీ20లు ఆడటం మానేసి టెస్ట్, వన్డే ఫార్మాట్లపై మాత్రమే విరాట్ ఫోకస్ పెట్టాలి. టీ20ల్లో ఆటగాళ్ల శక్తి వృథా అవుతోంది. అదీగాక విరాట్ కోహ్లీ ఫీల్డ్లో చాలా దూకుడుగా ఉండే ఆటగాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి 34 ఏళ్ల వయసు. అతను ఇదే ఫిట్నెస్ కొనసాగిస్తే మరో ఆరు నుంచి ఏడేళ్లు సునాయసంగా ఆడతాడు. టెస్టుల్లో మరో 30-40 మ్యాచ్ లు ఆడితే మరో 25 సెంచరీ చేయడం కోహ్లీకి ఏం అసాధ్యమేమి కాదు.

అప్పుడు మరో 25 సెంచరీలు చేయడం అసాధ్యమేమీ కాదు. విరాట్ కోహ్లీ దీనిని దృష్టిలో ఉంచుకోవాలి. వాస్తవానికి విరాట్ కోహ్లీ మానసికంగానే గాకుండా ఫిజికల్గా చాలా ఫిట్. ప్రస్తుతం అతను మంచి ఏకాగ్రతతో బాగా ఆడుతున్నాడు. అతను వంద సెంచరీలు చేయడం మీద ఫోకస్ పెట్టాలి.'అని అక్షర్ సూచించాడు. ఇక విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్లలో ఎవరు గొప్ప అనే చర్చ పనికిమాలినదని షోయబ్ అక్తర్ తెలిపాడు. విరాట్ కోహ్లీ ముందు బాబర్ ఆజామ్ ఏ లెక్కన సరితూగడని, అతని ముందు పిల్ల బచ్చా అని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. తొలి రెండు వన్డేల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. చెన్నై వేదికగా బుధవారం జరిగే మ్యాచ్లోనైనా అతను రాణిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయా ఆటగాళ్లు తమ ఐపీఎల్ టీమ్స్తో కలవనున్నారు. మార్చి 31 నుంచి ధనాధన్ లీగ్ ప్రారంభంకానుంది.