Shoaib Akhtar: వన్డే ప్రపంచకప్ 2023లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియాపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్తో సత్తా చాటుతున్న టీమిండియాకు తిరుగులేదని, రోహిత్ సేన టైటిల్ అందుకోవడం ఖాయమని జోస్యం చెప్పాడు.
ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సమష్టి ప్రదర్శన కనబర్చిన టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా.. ప్రపంచకప్లో 20 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్పై గెలుపొందింది.

ఈ మ్యాచ్ ఫలితాన్ని తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషించిన షోయబ్ అక్తర్.. రోహిత్ సేన ఆటతీరును కొనియాడాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ను అయితే ఆకాశానికెత్తాడు. 'ఒత్తిడిలో చెలరేగే ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆ ఒత్తిడే అతనికి పరుగులతో పాటు సెంచరీ చేసే అవకాశం ఇస్తోంది. విన్నింగ్ నాక్స్ ఆడటం.. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను పెంచుకోవడం అతనికి అలవాటుగా మారింది. దీనికి అతను పూర్తిగా అర్హుడు.
శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్లతో టీమిండియాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. రోహిత్ శర్మ నిర్లక్షంగా ఔటవ్వకుంటే టీమిండియాకు తిరుగుండదు. న్యూజిలాండ్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా బాధ్యత తీసుకున్నాడు. రనౌటవ్వకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా బాగానే ఆడేవాడు.
బౌలింగ్లో మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. న్యూజిలాండ్ 300-350 స్కోర్ చేయకుండా అతనే అడ్డుకున్నాడు. కాస్త పరుగులిచ్చినా.. ఐదు వికెట్లు తీసాడు. అతని సత్తా ఏంటో తెలియజేశాడు. ఇదే బౌలింగ్ అటాక్ను కొనసాగించాల్సిన అవసరం టీమిండియాకు ఉంది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక రోహిత్ సేన టైటిల్ గెలవడం ఎవరూ కూడా ఆపలేరు.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను మట్టికరిపించిన టీమిండియా.. తదుపరి మ్యాచ్ను లక్నో వేదికగా ఆదివారం ఆడనుంది. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో తలపడనుంది.