కరాచీ: పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భయపడిపోతున్నాడని దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. రోహిత్ శర్మ గొప్ప బ్యాటరని, మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్తో శనివారం జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ(11) దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే.
షాహిన్ అఫ్రిది బౌలింగ్లో హిట్ మ్యాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని బౌలింగ్ ఆడేందుకు తీవ్రంగా ఇబ్బందిపడిన రోహిత్.. చివరకు వికెట్ ఇచ్చుకొని నిరాశగా పెవిలియన్ చేరాడు. వరుసగా రెండు బంతులను ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన షాహిన్.. మూడో బంతిని తెలివిగా ఇన్ స్వింగర్గా వేసి రోహిత్ను బోల్తా కొట్టించాడు.

షాహిన్ ఇన్ స్వింగర్ను పసిగట్టలేకపోయిన రోహిత్.. డిఫెన్స్ చేసే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు. ఇక షాహిన్ అఫ్రిది బౌలింగ్పై ప్రశంసల జల్లు కురిపించిన షోయబ్ అక్తర్.. అతని బౌలింగ్ను ఆడేందుకు రోహిత్ చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడని చెప్పాడు. 'షాహిన్ అఫ్రిది అసాధారణంగా బౌలింగ్ చేశాడు. అందరూ ఊపించినట్లుగానే బంతితో నిప్పులు చెరిగాడు. అతని బౌలింగ్కు రోహిత్ శర్మ దగ్గర సమాధానం లేకపోయింది.
2022లో చివరి సారిగా షాహిన్ అఫ్రిది బౌలింగ్ ఆడిన రోహిత్ శర్మకు మళ్లీ అతని బౌలింగ్ ఆడే అవకాశం దక్కలేదు. షాహిన్ బౌలింగ్ను రోహిత్ శర్మ అర్థం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఔటైన విధానం ఏ మాత్రం బాలేదు. అతను చాలా మెరుగైన ఆటగాడు. ఇలా ఔటవ్వాల్సింది కాదు. అతను ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది.
షాహిన్ బౌలింగ్లో అతను అనవసర ఆందోళనకు గురవుతున్నాడు.'అని షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యిన విషయం తెలిసిందే. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పాకిస్థాన్ బ్యాటింగ్ సాధ్యమవ్వలేదు. దాంతో కటాఫ్ టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో266 పరుగులకు కుప్పకూలింది. ఇషాన్ కిషన్(81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 82), హార్దిక్ పాండ్యా(90 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 87) అసాధారణ ఇన్నింగ్స్ ఆడారు. ఐదో వికెట్కు 138 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్, నసీమ్ షా మూడేసి వికెట్లు తీసారు.