
కరాచీ: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో పాకిస్థాన్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి ఆట స్కూల్ లెవెల్ క్రికెట్ను తలపిస్తుందని ఘాటుగా విమర్శించాడు. అసలు దీనంతటికి కారణం పాకిస్థాన్ క్రికెట్ బోర్డేనని మండిపడ్డాడు. వారు జట్టు ఎంపిక నుంచి టీమ్ మేనేజ్మెంట్ వరకు యావరేజ్ వాళ్లను తీసుకోవడంతో ఆట కూడా అలానే ఉంటుందన్నాడు. పీసీబీ విధి విధానాలు మొత్తం యావరేజ్గా ఉన్నాయని విమర్శిస్తూ ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్ ఓ వీడియో క్లిప్ను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు.
'అసలు పీసీబీ విధానాలే బాలేవు. యావరేజ్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటారు. వారితోనే మ్యాచ్లు ఆడిస్తుంటారు. యావరేజ్ జట్లను ఎంపిక చేస్తుండటంతో వాళ్లు కూడా యావరేజ్ ప్రదర్శనే చేస్తుంటారు. ఫలితం కూడా యావరేజ్గానే ఉంటుందని' అక్తర్ వ్యాఖ్యానించారు. 'పాక్ టెస్టు మ్యాచ్లు ఆడినప్పుడల్లా పూర్తిగా తేలిపోతారు. వాళ్లు(పాక్ ఆటగాళ్లు) పాఠశాల స్థాయి క్రికెట్ ఆడుతున్నారు. అంతర్జాతీయ క్రికెటర్లను టీమ్మేనేజ్మెంట్ పాఠశాల స్థాయి క్రికెటర్లుగా మార్చింది. ఇప్పటికైనా టీమ్మేనేజ్మెంట్ను మార్చాలనే యోచనలో ఉంది సంతోషం. కానీ అదెప్పుడో మాత్రం చెప్పలేదు'అని షోయబ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. కివీస్ యువ పేసర్ కైల్ జేమీసన్ (5/69) ధాటికి 297 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(238) డబుల్ సెంచరీకి తోడు.. హెన్రీ నికోలస్(157), డార్లీ మిచెల్(102) సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్ను 659/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆతిథ్య కివీస్ 362 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 8 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ దారుణంగా విఫలమైన పాక్.. మ్యాచ్లో గట్టెక్కాలంటే అద్భుతాలే జరగాలి.
సంక్షిప్త స్కోర్లు:
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 297
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 659/6 డిక్లేర్డ్
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 8/1 (11)