
దుబాయ్: టీమిండియా ప్రదర్శన పట్ల పాకిస్థాన్ ప్రజల సదాభిప్రాయంతోనే ఉన్నారని ఆ దేశ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. భారత జట్టులోని విరాట్ కోహ్లీ, రోహిత్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ల ఆటతీరును పాక్ ప్రజలు బహిరంగంగా ప్రశంసిస్తున్నారని తెలిపాడు. టీమిండియా మంచి టీమ్ కాదని చెప్పేవారు ప్రస్తుతం ఒక్కరు కూడా పాకిస్థాన్లో లేరన్నాడు. రోహిత్ శర్మను ఇండియా ఇంజమామ్ ఉల్ హక్గా పాక్ ప్రజలు పరగణిస్తారని తెలిపాడు. తాజాగా జీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ప్రస్తుతం పాకిస్థాన్లో భారత జట్టు మంచి టీమ్ కాదని చెప్పేవారు ఒక్కరు కూడా లేరు. వారు బహిరంగంగా భారత జట్టు ప్రదర్శనను ప్రశంసిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గొప్ప ఆటగాళ్లుగా చూస్తున్నారు. పాకిస్థాన్ ప్రజలు రోహిత్ శర్మను ఇండియా ఇంజమామ్ ఉల్ హక్గా పిలుస్తారు. ఆస్ట్రేలియాలో అద్భుత ప్రదర్శన కనబర్చిన పంత్ ఆట తీరును పాక్ ప్రజలు కొనియాడారు. సూర్యకుమార్ యాదవ్ను మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ పట్ల పాకిస్థాన్ ఆటగాళ్లు సదాభిప్రాయంతో ఉన్నారు.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
ఇక పాకిస్థాన్ క్రికెటర్ను అయిన తనకు భారత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటాన్ని అదృష్టంగా భావిస్తానన్నాడు. అందుకే భారత్-పాక్ మ్యాచ్లు జరిగేటప్పుడు బ్యాలెన్స్గా మాట్లాడుతానని వెల్లడించాడు. 'మీరు నా వీడియోలు చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. ఏ దశలోనూ నేను ఒకరిపై వివక్ష చూపేలా మాట్లాడను. ఓ మాజీ క్రికెటర్గా, బ్రాండ్ అంబాసిడర్గా, మానవతావాదిగా నా మాటలు బ్యాలెన్స్గా ఉండాలని భావిస్తాను. డబ్బుల కోసం నేను అలా మాట్లాడుతానని కొందరంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. నాకు భారత్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. పాకిస్థాన్ ప్లేయర్ అయిన నేను భారత అభిమానుల ప్రేమను అందుకోవడం నా అదృష్టంగా భావిస్తా. నా వల్ల వారి మనుసులు గాయపడవద్దనుకుంటా'అని అక్తర్ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇరు దేశాల ఆటగాళ్లు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే పాకిస్థాన్దే పై చేయిగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య 199 మ్యాచ్లు జరగ్గా.. భారత్ 70 మ్యాచ్ల్లో విజయం సాధించింది. పాక్ మాత్రం 86 విజయాలు నమోదు చేయగా.. 42 మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిసాయి. అయితే ప్రపంచకప్ల్లో, టీ20 ఫార్మాట్లో మాత్రం దాయాదీపై భారత్దే పూర్తి ఆధిపత్యం. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్ టైగా ముగిసినా.. బౌలౌట్లో విజయం భారత్నే వరించింది. ఇక వన్డే ప్రపంచకప్ల్లో ఏడింటికి ఏడు భారత్ గెలిచిన భారత్.. టీ20 ప్రపంచకప్ల్లోనూ ఐదింటి ఐదు విజయం సాధించింది.