పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పాకిస్థాన్తో మెల్బోర్న్ వేదికగా జరిగిన ఐకానిక్ మ్యాచ్ను చూపించాలని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సూచించాడు. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఆఖరి బంతి వరకు క్రీజులో నిలబడి ఒంటి చేత్తో చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఓటమి తప్పదని భావించిన ఈ మ్యాచ్లో కింగ్ తనదైన బ్యాటింగ్తో టీమిండియాను విజేతగా నిలబెట్టాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం టీమిండియాకు చాలా ముఖ్యం. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 23న భారత్-పాకిస్థాన్లు దుబాయ్ వేదికగా తలపడున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈ హైఓల్టేజ్ మ్యాచ్ గురించి మాట్లాడిన అక్తర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కోహ్లీ ఫామ్లోకి రావాలంటే మెల్బోర్న్ ఐకానిక్ ఇన్నింగ్స్ను చూపించాలని, అదే అతన్ని మేలుకొలుపుతుందని చెప్పాడు.
'పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీలో అసలు సిసలు బ్యాటర్ను నిద్రలేపాలంటే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. పాకిస్థాన్తో మెల్బోర్న్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ను గుర్తు చేస్తే సరిపోతుంది. అతను ఆ మ్యాచ్లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఆఖరి వరకు నిలిచి టీమిండియాను గెలిపించాడు.
ఇప్పుడు పాకిస్థాన్ తరఫున బాబర్ ఆజామ్ ఆ పాత్ర పోషిస్తాడని అనుకుంటున్నా. ఓపెనర్ సైమ్ ఆయుబ్ గాయపడటం జట్టుకు నష్టం చేసే విషయమే. ఫకర్ జమాన్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని భావించా. వారి ఓపెనింగ్ విధ్వంసమే. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టమే. ఇరు జట్లు హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్నాయి.
దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ కావడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే టీ20 ప్రపంచకప్ 2021లో దుబాయ్ వేదికగా జరిగన మ్యాచ్లో పాక్ 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. కాబట్టి, ఈ సారి పాక్ గెలవాలనుకుంటున్నా. అయితే టీమిండియా విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన భారీ మూల్యం తప్పదు.'అని షోయబ్ అక్తర్ తెలిపాడు.