
న్యూఢిల్లీ: వెన్నెముక గాయం గురించి టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ముందే హెచ్చరించానని పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. తాను అలా చెప్పిన కాసేపటికే అతను గాయపడ్డాడని గుర్తు చేసుకున్నాడు. 2018 ఆసియా కప్ సందర్భంగా తొలిసారి వెన్నుగాయానికి గురైన హార్దిక్ పాండ్యా.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత లండన్లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే, ఆ గాయం నుంచి కోలుకున్నాక కూడా అతను పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేకపోయాడు. దాంతో అతని కెరీర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది.
కొంతకాలం బ్యాటింగ్కే పరిమితమైన అతను.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్తో పాటు టీ20 ప్రపంచకప్లోనూ విఫలమయ్యాడు. దాంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అక్తర్.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్తో హార్దిక్ పాండ్యా గాయంపై మాట్లాడాడు. తాను హెచ్చరించిన గంటన్నరకే హార్దిక్ గాయపడ్డాడని గుర్తు చేసుకున్నాడు.
'ఒకసారి నేను దుబాయ్లో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాతో మాట్లాడాను. వాళ్లను చూస్తుంటే బక్కపలచగా ఉన్నారు. వాళ్ల వెన్నెముకలు కూడా బలంగా లేవని అనిపించింది. అప్పుడు పాండ్యా తీరికలేని విధంగా క్రికెట్ ఆడుతున్నట్లు చెప్పాడు. నువ్వు త్వరలోనే గాయపడతావని అతన్ని అప్పుడే హెచ్చరించా. నేను అలా చెప్పిన గంటన్నరకే అతడు గాయపడ్డాడు' అని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. కాగా, 2018 ఆసియా కప్ సందర్భంగా పాకిస్థాన్తో ఆడిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఆ తర్వాత అతడికి వెన్నెముక సమస్య వెంటాడింది.
ఓవైపు గాయంతో అన్ఫిట్గా ఉన్న హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్ టీమ్లోకి తీసుకొని ఆడించారు. అతని పేలవ ప్రదర్శనతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా దారుణంగా విఫలమవడంతో భారత్ సెమీస్ చేరకుండానే ఇంటిదారిపట్టింది.