
రావల్పిండి: కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్కు అండగా నిలుద్దామని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఏ ప్రభుత్వానికైనా కష్టమేనన్నఈ రావల్పిండి ఎక్స్ప్రెస్.. ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత్కు సహాయచేద్దామని తన యూట్యుబ్ చానెల్ వేదికగా పాక్ ప్రజలను కోరాడు. భారత్కు చాలా సంఖ్యల్లో ఆక్సిజన్ ట్యాంకులు అవసరమని, వాటి కోసం విరాళాలు సేకరించి అందజేద్దామని పిలుపునిచ్చాడు.
'మా ప్రభుత్వం, అభిమానులను ఇండియాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇండియాకు చాలా ఆక్సిజన్ ట్యాంకులు కావాలి. ప్రతి ఒక్కరూ ఇండియా కోసం విరాళాలు సేకరించి, వాళ్లకు అవసరమైన ఆక్సిజన్ ట్యాంకులను అందించాలని కోరుతున్నా.'అని ఆ వీడియోలో అక్తర్ కోరాడు. ఇంతకుముందు కూడా ఇండియాలో కరోనా తీవ్రతను గమనించిన అక్తర్.. సాయం చేయాల్సిందిగా ప్రపంచ దేశాలను కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండగా.. అక్తర్ను భారత ప్రజలు కొనియాడుతున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి పట్టపగ్గాలేకుండా విజృంభిస్తోంది. వైరస్ సంక్రమణ రోజుకొక కొత్త రికార్డును అధిగమిస్తోంది. దేశంలో వరుసగా మూడవ రోజు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం శుక్రవారం భారత్లో రికార్డు స్థాయిలో 3,46,786 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో మరేదేశంలోనూ లేనంతగా ఒకేరోజు (బుధవారం) 3.14 లక్షల అత్యధిక కేసులతో రికార్డులకెక్కిన భారత్ వరుసగా మూడోరోజూ ఈ పరంపరను కొనసాగించింది. దీనితో భారతదేశంలో మూడు రోజుల్లోనే 9.94 లక్షల కొత్త కేసులు వచ్చాయి.
ప్రపంచంలో 24 గంటల్లో మొత్తం 8.9 లక్షల కేసులు నమోదుకాగా, అందులో 38 శాతం భారతదేశానికి చెందినవి. మొదటిసారిగా ఒక్కరోజులో 2,19,838 మంది ప్రజలు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో ఒకదేశంలో ఒకరోజులో ఇంత మంది కోలుకోవడం కూడా ఇదే అత్యధికం కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా 2,624 మంది మృత్యువాతపడ్డారు. 24 గంటల్లో కరోనా కారణంగా సంభవించిన మరణాల్లో ఇది కొత్త రికార్డు. యాక్టివ్ కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది.