టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ ఓటమిపాలైంది. తొలి మ్యాచ్లో పసికూన అమెరికా చేతిలో చిత్తయిన పాక్.. ఆదివారం భారత్ చేతిలో ఖంగుతిన్నది. ఈ వరుస పరాజయాలతో సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఐర్లాండ్పై అమెరికా విజయం సాధించినా.. తమ మెరుగైన రన్రేట్ను కాపాడుకున్నా పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. భారత్తో జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

ఈ పరాజయం తనను తీవ్రంగా నిరాశపరిచిందని, ఏ మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ జట్టును ఆ దేవుడే కాపాడాలని, సూపర్-8కు కూడా చేరుతుందో? లేదోనని సందేహం వ్యక్తం చేశాడు. భారత్తో మ్యాచ్లో బౌలింగ్లో సత్తా చాటిన పాకిస్థాన్... బ్యాటింగ్లో మాత్రం తేలిపోయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ పటేల్(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 20) మినహా అంతా విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహమ్మద్ రిజ్వాన్(44 బంతుల్లో ఫోర్, సిక్స్తో 31) మినహా అంతా విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా(3/14) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఓటమిపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన షోయబ్ అక్తర్ భావోద్వేగానికి గురయ్యాడు. 'ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. చాలా విషయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇది జట్టుకు నిజంగా బాధాకరం. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచి ఉండాల్సింది. బంతికో పరుగు చేయాల్సిన స్థితిలో కూడా విజయాన్ని అందుకోవడం దారుణం.
ఫకర్ జమాన్ క్రీజులో ఉన్నప్పుడు పాకిస్థాన్ విజయానికి 47 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నా పాక్ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఈ ఫలితంపై నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. ఏ మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఈ ఓటమితో పాకిస్థాన్ మొత్తం బాధలో ఉంది.
వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని ఆట ప్రారంభంలోనే చెప్పాను. ఒకరి కోసం ఒకరు ఆడాలని, దేశం కోసం ఆడాలని చెప్పాను. ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదల పాకిస్థాన్లో కనిపించలేదు. 1000 పరుగులు, 4000 లేదా 10000 కెరీర్ పరుగులు వంటి వ్యక్తిగత మైలురాళ్లు ఏ మాత్రం ముఖ్యం కాదు. పాకిస్థాన్ సూపర్-8 అర్హత సాధిస్తుందా? లేదా అన్నది సందేహంగా మారింది. అది దేవుడికి మాత్రమే తెలుసు'అని షోయబ్ అక్తర్ భావోద్వేగానికి గురయ్యాడు.