యూవీ, భజ్జీని తిట్టడం అమానుషం: అక్తర్

ఇస్లామాబాద్: కరోనా ధాటికి విలవిలలాడుతున్న పేద ప్రజలకు తన స్వచ్చంద సంస్థ ద్వారా సాయం చేస్తున్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అఫ్రిది చేస్తున్న సేవకు ముగ్దులైన ఈ స్టార్ క్రికెటర్లు అతని ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వాలని ఓ వీడియో ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
అయితే ఇది నచ్చని కొందరూ భారత అభిమానులు.. యూవీ, భజ్జీపై ట్రోలింగ్కు దిగారు. మతి ఉండే మాట్లాడుతున్నారా.. శతృ దేశానికి సాయం చేయమంటారేంది? అని ఘాటుగా కామెంట్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్ను ఈ ఇద్దరు లెజెండ్స్ గట్టిగానే తిప్పికొట్టారు. సరిహద్దుల కన్నా మానవత్వం గొప్పదని మిమర్శకుల నోళ్లు మూయించారు.

అమానుషం..
అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. యూవీ, భజ్జీలు ట్రోలింగ్కు గురవ్వడంపై స్పందించాడు. మంచికి అండగా నిలిచిన ఆటగాళ్లను తిట్టడం అమానుషమన్నాడు. ‘భజ్జీ, యూవీని విమర్శించడం అమానుషం. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం, మతం ముఖ్యం కాదు. అన్నిటికన్నా మానవత్వమే గొప్ప. 'అని చెప్పుకొచ్చాడు.

నా సంపాదనలో 30 శాతం...
ఇక క్రికెటర్గా భారత పర్యటనలో సంపాదించిన మొత్తంలో 30 శాతం అక్కడి కింది స్థాయి సిబ్బందికి ఇచ్చేవాడినని అక్తర్ తెలిపాడు. ‘భారత ప్రజలు నాపై చూపించిన ప్రేమకు నేనెప్పుడు కృతజ్ఞుడిని. భారత్లోనే నేను ఎక్కవగా సంపాదించాను. ఆ సంపాదనలో 30 శాతం నాతో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులకు ఇచ్చేవాడిని. ఈ విషయాన్ని నేను ఇంతవరకు ఎక్కడా.. ఎప్పుడూ చెప్పలేదు. నా డ్రైవర్స్, భద్రతా సిబ్బందికి అండగా ఉండేవాడిని.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

స్లమ్ ఏరియాలు సందర్శించా..
ఇక భారత్లోని స్లమ్ ఏరియాలను కూడా సందర్శించినట్లు ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్ చెప్పుకొచ్చాడు. ‘భారత్లోని ధారవి, సియన్ వంటి స్లమ్ ఏరియాలను సందర్శించా. అక్కడి ప్రజలతో కలిసి పని చేశాను.'అని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. ఇటీవలే పాకిస్థాన్ ప్రజల కోసం 10 వేల వెంటిలేటర్ల తయారీ కోసం భారత్ సాయం చేయాలని అక్తర్ కోరాడు. ఈ సాయాన్ని తమ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుదని విజ్ఞప్తి చేశాడు.

ఫండ్స్ కోసం భారత్-పాక్ మ్యాచ్..
ఫండ్ రైజింగ్ కోసం తటస్థ వేదికగా భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక వన్డే సిరీస్ నిర్వహించాలని ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్ ప్రతిపాదించాడు. దీని వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడటంతో పాటు ఆర్థిక సాయం లభిస్తుందని అభిప్రాయడ్డాడు. ‘ఈ సంక్షోభ పరిస్థితుల్లో భారత్-పాక్ మధ్య మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నా. ఈ మ్యాచ్ల ఫలితాలపై ఇరుదేశాల ప్రజలు కలత చెందరు. కరోనా కారణంగా జరుగుతున్న మ్యాచ్లనుకొని.. ఇరు దేశాల అభిమానులు ఆటను ఆస్వాదిస్తారు. కోహ్లీ సెంచరీ చేసినా పాక్ ప్రజలు.. బాబర్ శతకం బాదినా భారతీయులు సంతోషిస్తారు. మైదానంలో ఏం జరిగినా ఇరు జట్లు విజేతలుగా నిలుస్తాయి.'అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications