
దుబాయ్: ఆసియాక్పలో భారత జట్టు బోణీ చేసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన తమ ఆరంభ మ్యాచ్లో పాకిస్థాన్పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా టీ20 ప్రపంచకప్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నట్టయ్యింది. హార్దిక్ పాండ్యా (3/25; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 33 నాటౌట్) ఆల్రౌండ్షోతో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35), కోహ్లీ (34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 35) సహకారం అందించారు.
లక్ష్య ఛేదన కేవలం 148 పరుగులే అయినా మ్యాచ్లో కావాల్సినంత ఉద్వేగం.. నరాలు తెగే ఉత్కంఠకు కొదువ లేకుండా పోయింది. అయితే పాక్ బౌలర్ల పట్టు వీడని పోరాటం ముందు భారత బ్యాటర్ల తెగింపుదే పైచేయి అయ్యింది. చివరి ఓవర్ వరకు ఇరు జట్లకు అవకాశం కనిపించిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్కు ఆశించిన విధంగానే మజాను అందించింది.
అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మాత్రం ఈ మ్యాచ్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాయాదుల పోరు తనను ఆకట్టుకోలేదని, ఇరు జట్లూ ఓడిపోవాలని ప్రయత్నించాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఇది 'క్రికెట్కు బ్యాడ్ డే' అంటూ మండిపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మ్యాచ్పై స్పందించిన అక్తర్.. జిడ్డు బ్యాటింగ్తో చికాకు తెప్పించారని అసహనం వ్యక్తం చేశాడు.
'భారత్, పాకిస్థాన్ జట్లకు శుభాకాంక్షలు చెబుతున్నా. ఎందుకంటే ఇరు జట్లూ గేమ్ ఓడిపోవడానికి ప్రయత్నించాయి. భారత్ దాదాపు విజయవంతమైంది. కానీ హార్దిక్ పాండ్య అడ్డుగా నిలిచాడు. ఎందుకు ఇలా చెబుతున్నానంటే..? రిజ్వాన్ 42 బంతుల్లో 43 పరుగులు చేయడం ఆశ్చర్యం కలిగించకమానదు. పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొలి ఆరు ఓవర్లలో 19 డాట్ బాల్స్ పడ్డాయి. అలానే ఇద్దరు సారథులు తమ జట్టు ఎంపికను సరిగా చేయలేదు. రిషభ్ పంత్ను భారత్ పక్కన పెట్టేసింది. పాకిస్థాన్ మాత్రం ఇఫ్తికార్ అహ్మద్ను నాలుగో స్థానానికి పంపింది. అతన్ని అగౌరవపరచాలనే ఉద్దేశం నాకు లేదు
బాబర్ అజామ్ ఓపెనింగ్కు రావొద్దని ఇప్పటికే చాలాసార్లు చెప్పా. అతడు వన్డౌన్లో వచ్చి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఫకార్ జమాన్, రిజ్వాన్ తప్పనిసరిగా ఓపెనర్లుగా రావాలి. భారత్, పాక్ జట్లు చెత్త క్రికెట్ను ఆడాయి. ఇరు జట్లూ భారీ తప్పిదాలు చేశాయి. అందుకే ఇది క్రికెట్కు బ్యాడ్ డే అని చెబుతున్నా. ఇరు జట్లూ దారుణంగా క్రికెట్ ఆడాయి. నాకైతే నచ్చలేదు. ఎవరు ఏమనుకున్నా సరే నేను లెక్కచేయను'' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.