ఇస్లామాబాద్: క్రికెట్ గాడ్, టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ను తన తొలి బంతికే ఔట్ చేశానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ గుర్తు చేసుకున్నాడు. తన ఫస్ట్ మ్యాచ్లోనే ఆల్టైమ్ ఫేవరేట్ బ్యాట్స్మన్ అయిన సచిన్ ఔట్ చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని, ఆ క్షణం ఇప్పటికి మరిచిపోలేనని ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్ చెప్పుకొచ్చాడు.
మాములుగా భారత్, పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటేనే ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో చూస్తారు. అందులోనూ షోయబ్ అక్తర్- సచిన్ పోరంటే మరింత ఆసక్తికరంగా ఉండేది. అక్తర్ బౌలింగ్లో సచిన్ బౌండరీ బాదినా.. సచిన్ను అక్తర్ అవుట్ చేసినా.. అభిమానుల ఆనందానికి అవధులుండవు. అప్పట్లో తామిద్దరి మధ్య ఉండే పోటీకి సంబంధించి ఆసక్తికర విషయాలను అక్తర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
'1999లో మా జట్టు భారత పర్యటనకు వెళ్లింది. కోల్కతా టెస్ట్లో సచిన్ను ఫస్ట్ టైమ్ చూశా. అప్పటికే అతను దేవుడని విన్నా. కానీ సచిన్ చూడగానే నాకు ఇతను క్రికెట్ దేవుడా? అయితే నా సత్తా ఏంటో చూపించాలనుకున్నా. ఇక సచిన్ కూడా నన్ను చూశాడు. కానీ ఒకరిని ఒకరం పట్టించుకోలేదు. అతను తన అటిట్యూడ్ చూపిస్తే నేను నా అటిట్యూడ్ చూపించా. కొంత కలవరపాటుగా ఉన్నప్పటికీ సచిన్ ఎలాగైనా ఔట్ చేయాలని గట్టిగా అనుకున్నాను.
బలంగా ఓ యార్కర్ వేశాను. అంతే సచిన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిడ్ వికెట్ ఎగిరి అవతల పడింది. ఇక నా ఆనందానికి అంతులేదు. మోకాళ్లపై కూర్చొని పెద్దగా అరిచాను. ఆ క్షణం ఇప్పటికి మరిచిపోలేను. అందరూ క్రికెట్ దేవుడిగా పిలిచే సచిన్ను తొలి బంతికే ఔట్ చేశా. ఇప్పటికీ అదో గొప్ప జ్ఞాపకమం'అని అక్తర్ గుర్తు చేసుకున్నాడు.
ఇక అక్తర్ తన అరంగేట్ర మ్యాచ్లో మాస్టర్ ఒక్కరినే బౌల్డ్ చేయలేదు.. దిగ్గజ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, వెంకటేశ్ ప్రసాద్లను ఔట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో (4/71) మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో కూడా మరో నాలుగు వికెట్లు తీయడంతో పాక్ నాటి ఐకానిక్ మ్యాచ్లో 46 రన్స్తో విజయం సాధించింది. అక్తర్ అరంగేట్ర మ్యాచ్లో సచిన్ను ఔట్ చేసినా.. ఆ తర్వాత మాస్టర్ రఫ్ఫాడించాడు. ఇక షోయబ్ ఉన్న పాక్ జట్టుతో 9 టెస్ట్లు ఆడిన సచిన్.. 41.60 సగటుతో 416 పరుగులు చేశాడు. ఇందులో సచిన్ను అక్తర్ మూడే సార్లు ఔట్ చేశాడు. ఇక 19 వన్డేల్లో 45.47 యావరేజ్తో సచిన్ 864 రన్స్ చేయగా.. అక్తర్ ఐదు సార్లు ఔట్ చేశాడు.