న్యూఢిల్లీ: ఆసియాకప్లో భాగంగా దాయాదీ దేశాలు భారత్-పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్లోనే తలపడనున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్ అనంతరం మళ్లీ ఇన్నాళ్లకు దాయాదీ దేశాలు తలపడుతుండటంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడించారు. తాజాగా షోయబ్ అక్తర్ ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్న అక్తర్.. తమ హయాంలో భారత్-పాక్ తలపడినప్పుడు ఉన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. ఓ మ్యాచ్కు ముందు సౌరవ్ గంగూలీని 'నీ బొక్కలు విరుగ్గొడతా'అని బెదిరించినట్లు గుర్తు చేసుకున్నాడు.
1999లో మొహాలీ వేదికగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ తీవ్రంగా గాయపడ్డాడు. అక్తర్ వేసిన షార్ట్ పిచ్ బాల్ అతని పక్కటెముకలకు బలంగా తాకింది. దాంతో మైదానంలో కుప్పకూలిన గంగూలీ.. రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అయితే ఆ మ్యాచ్కు ముందు జరిగిన టీమ్ సమావేశంలో భారత ఆటగాళ్లు గాయపడేలా బౌలింగ్ చేయాలని తనకు సూచించారని అక్తర్ తెలిపాడు. 'నేను తరుచుగా బ్యాటర్ల పక్కటెముకలు, తలను టార్గెట్ చేసేవాడిని. గంగూలీ బొక్కలు విరగ్గొట్టాలని మేం నిర్ణయించుకున్నాం. ఆ మ్యాచ్కు ముందు జరిగిన సమావేశంలోనే నేను బ్యాటర్లను ఎలా టార్గెట్ చేయాలనే విషయంపై పలు సూచనలు అందాయి.
'నేను అతన్ని ఔట్ చేయవద్దా?'అని మీటింగ్లో ప్రశ్నించగా వద్దని చెప్పారు. నీ బౌలింగ్లో చాలా పేస్ ఉంది. నీవు బ్యాటర్లను గాయపర్చేలా బౌలింగ్ చేయాలని, వారిని భయపెట్టాలని మిగతాది మేం చూసుకుంటామని చెప్పారు.'అని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. వెంటనే వీరేంద్ర సెహ్వాగ్ జోక్యం చేసుకొని ఈ ఇంటర్వ్యూ గంగూలీ చూస్తాడు జాగ్రత్త.. అని హెచ్చరించాడు. అయితే గంగూలీకి ఈ విషయం ఎప్పుడో తెలుసని అక్తర్ పేర్కొన్నాడు. ఆ మీటింగ్ ముగిసిన వెంటనే ఆ రోజు గంగూలీతో తమ ప్లాన్ చెప్పానని, 'నీ బొక్కలు విరుగుతయ్ బిడ్డా'.. అని బెదిరించానని తెలిపాడు.
మైదానంలో ఉప్పు-నిప్పుగా ఉన్న గంగూలీ, అక్తర్.. ఆఫ్ ఫీల్డ్ మాత్రం మంచి రిలేషన్ మెయింటేన్ చేశారు. గంగూలీ సారథ్యంలో కూడా అక్తర్ ఆడాడు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో కేకేఆర్కు అక్తర్ ప్రాతినిథ్యం వహించగా.. దాదా ఆ జట్టుకు సారథ్యం వహించిన విషయం తెలిసిందే.