
కరాచీ: పాకిస్థాన్ బౌలర్లతో పోల్చితే భారత్ పేసర్లలో కసి, దూకుడు కనిపించదని మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఇటీవలి కాలంలో భారత పేస్ విభాగం బాగా పుంజుకున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో పాక్ పేసర్లతో పోలిస్తే బాగా వెనకపడి ఉందని అన్నాడు. ఫాస్ట్ బౌలింగ్లో పాక్ పేసర్ల ఆధిపత్యం గురించి ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీతో మాట్లాడిన అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారతీయుల ఆహారపు అలవాట్లను కించపరిచేలా వ్యాఖ్యానించాడు.
'భారత పేసర్లు తమ ఆహారపు అలవాట్ల కారణంగా బలహీనంగా కనిపిస్తారు. ఇదే వారికి పాక్ పేసర్లకు ఉన్న తేడా. పాకిస్థాన్ పేసర్ల ముఖాల్లో కనిపించే కసి, దూకుడు భారత ఫాస్ట్ బౌలర్ల ముఖాల్లో కనిపించదు. ఈ వ్యత్యాసం క్రికెట్ తొలినాళ్ల నుంచే ఉంది. అందుకు కారణం మా తిండి, వాతావరణం. తెలిపాడు. పాక్ బౌలర్లు బౌలింగ్ వేసే సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించరు. బ్యాట్స్మన్ను చంపైనా వికెట్ తీయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.
ఈ ధృక్పథమే వారికి వేగంగా బంతులు వేసేందుకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. దానికి తోడు తాము ఎక్కువగా మాంసాహారం తింటాం. దాంతో దృడంగా ఉంటాం. ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే సింహాల్లా పరుగెడతాం. ప్రస్తుతం తరం పాక్ పేసర్లలో షాహీన్ ఆఫ్రిదీ, హసన్ ఆలీల్లో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. 'అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం భారత పేస్ విభాగం బలంగా తయారైంది. కేవలం స్పిన్నర్లతోనే విజయాలు సాధిస్తుందనే అపవాదును చెడగొట్టుకొని విదేశాల్లోనూ సత్తా చాటుతుంది. వరల్డ్ బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. యువ ఆటగాళ్లతో రిజర్వ్ బెంచ్ కూడా చాలా బలంగా ఉంది.
జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, నవ్దీప్ సైనీ, టి నటరాజన్ వంటి పేసర్లతో భారత పేస్ విభాగం పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్ల పేసర్ల కంటే భారత పేస్ దళం దృడంగా కనిపిస్తోంది.