
ముంబై: టీమిండియా యువ పేసర్ శివమ్ మావి శ్రీలంకతో తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న శివమ్ మావి.. అసాధారణ ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కెరీర్ ఫస్ట్ మ్యాచ్లోనే (4/22) నాలుగు వికెట్లతో చెలరేగాడు. దాంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 2 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శివమ్ మావి.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్తో టీమిండియా తరఫున ఆడాలనే తన కల నెరవేరిందని చెప్పాడు. గత 6 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించానని చెప్పిన శివమ్ మావి.. చివరకు ఈ రోజు ఆ ప్రయత్నాలకు ఫలితం దక్కిందన్నాడు.
'అండర్ 19 ప్రపంచకప్ ఆడినప్పటి నుంచి గత 6 ఏళ్లుగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా. ఈ ఆరేళ్లు తీవ్రంగా కష్టపడ్డా. మధ్యలో గాయాలు ఇబ్బంది పెట్టాయి. దాంతో అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకున్న నా కల కలగానే మిగిలిపోతుందా? అని కంగారు పడ్డా. ఐపీఎల్ ఆడటంతో ఈ అలజడి కాస్త తగ్గింది. పవర్ ప్లేలో ఎదురు దాడికి దిగి వికెట్లు తీయడమే నా ప్రణాళిక. ఈ మ్యాచ్లో క్లీన్ బౌల్డ్ చేసి నేను తీసిన తొలి వికెట్ నాకు ఫేవరేట్'అని శివమ్ మావి చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. దీపక్ హుడా(23 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 41 నాటౌట్), అక్షర్ పటేల్(20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 31 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్తో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా(29), ఇషాన్ కిషన్ పర్వాలేదనపించారు. లంక బౌలర్లలో దిల్షాన్, మహీశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనుంజ డిసిల్వా, వానిందు హసరంగా ఐదు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. డసన్ షనక(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 45), చమిక కరుణరత్నే(16 బంతుల్లో 2 సిక్సర్లతో 23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీసారు.