టీమిండియా పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే రేర్ రికార్డ్కు బ్రేక్ పడింది. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్లు గెలిచిన ఆటగాడి శివమ్ దూబే అరుదైన ఘనతను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రేర్ రికార్డ్కు తాజాగా బ్రేక్ పడింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో చెత్త బ్యాటింగ్తో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
అయితే ఈ పరాజయంతో శివమ్ దూబే 37 మ్యాచ్ల తర్వాత తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. శివమ్ దూబే ఆడిన గత 37 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ రికార్డ్తోనే అతన్ని అందరి టీమిండియా లక్కీ ఛార్మ్గా పరిగణిస్తారు. కానీ ఆసీస్ పేస్ జోష్ హజెల్ వుడ్ దెబ్బకు లక్కీ ఛార్మ్కు కూడా ఓటమి తప్పలేదు. ఈ జైత్రయాత్రకు బ్రేక్ పడినా.. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్లు గెలిచిన ఆటగాడిగా శివమ్ దూబే నిలిచాడు. శివమ్ దూబే తర్వాత పాస్కల్ మురుంగి 27 మ్యాచ్లు గెలవగా.. జస్ప్రీత్ బుమ్రా 24 మ్యాచ్లు విజయం సాధించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తాజా పరాజయంతోనే బుమ్రా జైత్రయాత్రకు కూడా బ్రేక్ పడింది.

2019లో బంగ్లాదేశ్తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన శివమ్ దూబే..ఇప్పటి వరకు 43 టీ20లు ఆడాడు. ఇందులో వరుసగా 37 మ్యాచ్లు గెలిచాడు. 2019 డిసెంబర్లో త్రివేండ్రం వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో శివమ్ దూబే చివరిసారిగా ఓటమిని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత తాజా మ్యాచ్ వరకు తాను ఆడిన ప్రతీ మ్యాచ్ టీమిండియా గెలిచింది. గత రెండేళ్లుగా జట్టులో నిలకడగా అవకాశాలు అందుకుంటున్న శివమ్ దూబే.. భారత్ గెలిచిన టీ20 ప్రపంచకప్ 2024, ఆసియా కప్ 2025 జట్లలోనూ సభ్యుడిగా ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా 2021 టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ చేతిలో చివరిసారిగా ఓడాడు. ఆ తర్వాత తాను ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించింది.