ఇంగ్లండ్తో నాలుగో టీ20లో టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా కంకషన్ సబ్స్టిట్యూషన్గా బరిలోకి దిగడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. భారత బ్యాటింగ్ సందర్భంగా ఆఖరి ఓవర్లో శివమ్ దూబే తలకు బంతి తగలడంతో టీమిండియా కంకషన్ సబ్స్టిట్యూషన్గా హర్షిత్ రాణాను బరిలోకి దించింది. అతను మూడు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. టీమిండియా ఛీటింగ్ చేసి గెలిచిందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు ఆరోపించారు.
ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ సైతం ఈ కంకషన్ సబ్స్టిట్యూషన్ను తప్పుబట్టాడు. ఇది అన్యాయమని, రూల్స్కు విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. శివమ్ దూబేకు హర్షిత్ రాణా ఏ మాత్రం సరిపోలే ఆటగాడు కాదని, లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ కాదని అసహనం వ్యక్తం చేశాడు. ముంబై వేదికగా జరిగిన ఆఖరి టీ20లోనూ టాస్ సందర్భంగా తన నిరసనను తెలియజేశాడు. తుది జట్టును వెల్లడించిన అనంతరం నలుగురు పేర్లను కంకషన్ సబ్స్టిట్యూట్స్గా పేర్కొని మ్యాచ్ రిఫరీకి చురకలంటించాడు.

ఈ విమర్శలపై మౌనంగా ఉన్న శివమ్ దూబే తన ఆటతోనే బదులిచ్చాడు. ఆఖరి మ్యాచ్లో 2 ఓవర్లు బౌలింగ్ చేసి 2 కీలక వికెట్లు తీసాడు. తద్వారా హర్షిత్ రాణాలా బౌలింగ్ చేసే సామర్థ్యం తనకు ఉందని చాటి చెప్పాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన శివమ్ దూబే 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హర్షిత్ రాణా కంటే తక్కువ ఎకానమీని నమోదు చేయడంతో పాటు హాఫ్ సెంచరీ సాధించిన ఫిల్ సాల్ట్, జాకబ్ బెతెల్ను పెవిలియన్ చేర్చాడు. తద్వారా తనకు బౌలింగ్ సామర్థ్యం లేదని చెప్పిన జోస్ బట్లర్ నోరును తన ఆటతోనే మూయించాడు.
ఈ మ్యాచ్లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ(54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్లతో 135) విధ్వంసకర శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మతో పాటు శివమ్ దూబే(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/38) మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్(2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 55) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/25) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్కి ఓ వికెట్ దక్కింది.