బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సహకారంతోనే తాను మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేసానని టీమిండియా పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబే తెలిపాడు. తన బౌలింగ్ మెరుగయ్యేందుకు ఆయన ఎంతో కృషి చేశాడని చెప్పాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా యూఏఈతో బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో శివమ్ దూబే(3/4) మూడు వికెట్లతో సత్తా చాటాడు.
గతంలో కంటే శివమ్ దూబే బౌలింగ్ ఎంతో మెరుగైంది. స్లోయర్, ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలతో యూఏఈ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన శివమ్ దూబే 4 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసాడు. ఇందులో 10 డాట్ బాల్స్ ఉండటం విశేషం. ఈ మ్యాచ్ అనంతరం తన బౌలింగ్ ప్రదర్శనపై స్పందించిన శివమ్ దూబే.. ఈ క్రెడిట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ది కాదని, మోర్నీ మోర్కెల్దేనని స్పష్టం చేశాడు.

తాను టీమిండియాలోకి పునరాగమనం చేసినప్పటి నుంచి మోర్నీ మోర్కెల్ తన వెంట పడ్డాడని, తన బౌలింగ్ మెరుగయ్యేలా కీలక సలహాలు ఇచ్చాడని తెలిపాడు. గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కూడా తాను బౌలింగ్ చేయాల్సి ఉంటుందని ముందే చెప్పారన్నాడు.
'నేను భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నా బౌలింగ్పై మోర్నీ మోర్కెల్ వర్క్ చేశాడు. ప్రత్యేకంగా నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. వాటిపై నేను వర్క్ చేశాను. ఆఫ్ స్టంప్కు కొద్దిగా వెలుపల ఉండే లైన్లో బౌలింగ్ చేయాలని చెప్పాడు. నా స్లో డెలివరీని మెరుగుపరచడానికి నా రన్నప్ను కొద్దిగా మార్చడు. నా బౌలింగ్ జట్టుకు కీలకం అవుతుందని కెప్టెన్, కోచ్ నాకు చెప్పారు.
గత రెండు నెలలుగా నా ఫిట్నెస్పై చాలా వర్క్ చేశాను. నా బ్యాటింగ్ విషయానికొస్తే మిడిల్ ఓవర్లలో హిట్టింగ్ చేయడం నా బాధ్యత. గత కొన్నేళ్లుగా బౌలర్లు షార్ట్ బాల్స్తో నన్ను టార్గెట్ చేశారు. అయితే నేను నా షాట్లను మెరుగుపర్చుకున్నాను.'అని శివమ్ దూబే చెప్పుకొచ్చాడు. యూఏఈపై గెలిచిన భారత్.. ఆదివారం జరిగే మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడనుంది.