టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ మళ్లీ పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు. గత కొంత కాలంగా తన ఐరీష్ గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న శిఖర్ ధావన్.. ఆమెను మనువాడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఫిబ్రవరి మూడో వారంలో జరగనున్న ఈ వివాహానికి భారత క్రికెటర్లు, బాలీవుడ్ తారలు హాజరు కానున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే శిఖర్ ధావన్ పెళ్లిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. 2012లో అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్న ధావన్.. 2023లో ఆమెకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం కొన్నాళ్లకు దుబాయ్లో సోఫీ షైన్తో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత కొన్నాళ్లు సహజీవనం చేసిన ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్లకు సోఫీ షైన్తో శిఖర్ ధావన్ హాజరు కావడంతో వీరి ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ టోర్నీ ముగిసిన కొన్నాళ్లకు శిఖర్ ధావనే స్వయంగా సోషీ షైన్ తన ప్రియ సఖి అని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు. అయితే ఆయేషా ముఖర్జీ ఉండగానే.. సోఫీ షైన్తో శిఖర్ ధావన్ డేటింగ్ చేశాడనే ప్రచారం కూడా జరిగింది.

తన కంటే 10 ఏళ్లు పెద్దదైనా ఆయేషా ముఖర్జీని కూడా శిఖర్ ధావన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు సహజీవనం చేసిన ఈ జోడీ.. 2012లో పెళ్లితో ఒక్కటైంది. అప్పటికే ఆయేషా ముఖర్జీకి పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 2013 డిసెంబర్లో ఈ జోడీ ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అతని పేరు జొరావర్. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ జోడీ తమ 12 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకుంది. తన కొడుకు జొరావర్ను ఆయేషా కుటుంబం కలవనిస్తలేదని ధావన్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.
హాలీవుడ్ హీరోయిన్ను తలపించే సోఫీ షైన్ వయసు 35 ఏళ్లు. ఆమె ఒక ఐరిష్ ప్రొడక్ట్ కన్సల్టెంట్. ప్రస్తుతం అబుదాబిలో పని చేస్తున్నారు. సోఫీ షైన్ లిమెరిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఆమె నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు ధావన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ దాదాపు పుష్కర కాలం పాటు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. ఎన్నో ఏళ్లు వన్డేల్లో మ్యాచ్ విన్నర్గా నిలిచిన ధావన్ 44.11 సగటుతో 6793 పరుగులు చేశాడు. అందులో 17 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక టెస్టుల్లో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1759 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు.