ముంబై: టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్.. సినీరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. టీమిండియా స్టార్ ఓపెనర్గా చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడిన గబ్బర్.. ఓ ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ రూపొందిస్తున్న మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందని ఓ ఫిల్మ్ వెబ్సైట్ పేర్కొంది. ఇది పూర్తి స్థాయి పాత్ర అని, గెస్ట్ రోల్ కాదని తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ చిత్రం పేరు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక గబ్బర్ గతేడాది అక్టోబర్లో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న రామసేతు సినిమా సెట్లో కన్పించాడు. అయితే ధావన్ నటిస్తున్నది ఈ సినిమాలో కాదని సమాచారం. అక్షయ్ కుమార్, ధావన్ మంచి స్నేహితులు. సరదాగా షూటింగ్ చూసేందుకే ధావన్ రామసేతు సెట్కి వెళ్లినట్లు తెలుస్తోంది.ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్తోనూ ధావన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. గతేడాది డిసెంబర్లో రణ్వీర్ను కలిసిన ఫొటోను శిఖర్ ధావన్ అభిమానులతో పంచుకున్నాడు. చాలా కాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందన్నాడు. అప్పుడు విడుదలైన '83' సినిమా అద్భుతంగా ఉందని, సినిమా హిట్ అయినందుకు రణ్వీర్కు అభినందనలు కూడా తెలిపాడు.
ప్రస్తతం ఐపీఎల్ 2022 సీజన్లో బిజిగా ఉన్న ధావన్ పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. మైదానంలోనే కాదు సోషల్ మీడియాలనో ధావన్ చురుగ్గా ఉంటాడు. ఇన్స్టాగ్రాంలో సరదా రీల్స్తో అభిమానులను తరచూ అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వెండితెరపై తన నటనలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మరి యాక్టర్గా ధావన్ ఏమేరకు రాణిస్తాడో చూడాలి.