కొలంబో: బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. ఓ బ్యాట్స్మన్ తక్కువగా ఉండటం, స్లో వికెట్పై స్మార్ట్గా ఆడలేకపోవడం, 10-15 పరుగులు తక్కువ చేయడం తమ పతనాన్ని శాసించిందన్నాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంక 4 వికెట్లతో గబ్బర్ సేనను ఓడించింది. ఓ దశలో భారత్ విజయం ఖాయమని అంతా భావించగా.. ధనుంజయ డిసిల్వా(40 నాటౌట్) కడవరకు నిలిచి సైలెంట్గా మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన గబ్బర్.. తమ ఆటగాళ్ల ప్రదర్శనను మెచ్చుకున్నాడు.
'పిచ్ చాలా నెమ్మదిగా ఉండటంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. మాకు ఓ బ్యాట్స్మన్ తక్కువగా ఉండటం కూడా నష్టం చేసింది. అయితే మేం ఈ వికెట్పై కొంచెం స్మార్ట్గా ఆడాల్సింది. అయినా మేం ఓ దశలో మ్యాచ్పై పట్టు బిగించాం. కానీ 10-15 పరుగులు తక్కువగా చేయడంతో ఓటమి తప్పలేదు. అయినా మా ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. 132 పరుగుల స్వల్ప స్కోర్ అయినా ఆఖరి వరకు మ్యాచ్ తీసుకెళ్లారు. పోరాట పటిమ చూపించారు. మా కుర్రాళ్లకు నా హ్యాట్సాఫ్'అని ధావన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 రన్స్ మాత్రమే చేసింది. శిఖర్ ధావన్(40), దేవదత్ పడిక్కల్(29), రుతురాజ్ గైక్వాడ్(21) పర్వాలేదనిపించగా మిగతా బ్యాట్స్మన్ విఫలమయ్యారు. లంకబౌలర్లలో అకిలా ధనుంజయ రెండు వికెట్లు తీయగా.. చమీరా, హసరంగా, షనక తలో వికెట్ పడగొట్టారు. అనంతరం శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 133 పరుగులు చేసి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ధనుంజయ డిసిల్వా(40 నాటౌట్)కు తోడుగా మినోద్ భానుక(36) రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తీ, రాహుల్ చాహర్ తలో వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసాడు. ఓ దశలో భారత్ విజయం ఖాయమనిపించగా.. ధనుంజయ కడవరకు నిలిచి సైలెంట్గా మ్యాచ్ను ఫినిష్ చేశాడు.