మొహాలీ: బౌలింగ్ వైఫల్యంతోనే ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలయ్యామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా బుధవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సూపర్ బ్యాటింగ్తో చెలరేగిన ముంబై 6 వికెట్ల తేడాతో పంజాబ్పై గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శిఖర్ ధావన్.. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయకపోవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. సూర్య, ఇషాన్ అసాధారణ బ్యాటింగ్తో చెలరేగారని కొనియాడాడు.
'మేం అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాం. మేం విధించిన లక్ష్యం విజయానికి సరిపోతుందని భావించాం. కానీ దురదృష్టవశాత్తు మా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాం. రిషి ధావన్ అద్భుతంగా బౌలింగ్ చేసినా.. మరో ఎండ్లో అతనికి సహకారం లభించలేదు. మేం ఎక్కువగా ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలు వేసాం. పవర్ ప్లేలో ఇంకాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సింది.

ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అసాధారణ బ్యాటింగ్తో మా విజయవకాశాలను లాగేసారు. మేం కాస్త కట్టుదిట్టమైన లైన్స్లో బౌలింగ్ చేయాల్సింది. ఎందుకంటే వికెట్ చాలా బాగుంది. చేంజ్ ఆఫ్ పేస్ వర్కౌట్ అవుతుందని ముందే అనుకున్నాం. నాథన్ ఎల్లిస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఇతర బౌలర్లు రాణించలేకపోయారు. డ్యూ కూడా రావడంతో బౌలర్లకు కష్టమైంది. ఒక్క స్పిన్నర్ రాణించినా పరుగులు చేయడానికి ప్రత్యర్థికి ఇబ్బందిగా ఉండేది.'అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. లియామ్ లివింగ్ స్టోన్(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 77 నాటౌట్), జితేశ్ శర్మ(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్ ఓ వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్, సూర్య సూపర్ బ్యాటింగ్కు టీమ్ డేవిడ్(19 నాటౌట్), తిలక్ వర్మ(26 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, రిషి ధావన్ తలో వికెట్ పడగొట్టారు.