
లక్నో: 2023 వన్డే ప్రపంచకప్ గెలవడమే తన లక్ష్యమని టీమిండియా తాత్కలిక సారథి శిఖర్ ధావన్ అన్నాడు. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు అన్ని విధాల సిద్దమవుతున్నట్లు చెప్పాడు. ముఖ్యంగా ఫిట్నెస్పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం శిఖర్ ధావన్ సారథ్యంలో టీమిండియా సన్నదమైంది. ఇప్పటికే శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే జట్లతో వన్డే సిరీస్లను ధావన్ నేతృత్వంలో కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే.
తాజాగా గురువారం భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. గత రెండేళ్ల నుంచి వన్డే ఫార్మాట్లో శిఖర్ ధావన్ నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం ఫిట్గా తయారు కావడంపైనే దృష్టిసారించినట్లు ధావన్ వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం నేపథ్యంలో శిఖర్ ధావన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు.
'నా కెరీర్ చాలా బాగా సాగుతోంది. అందుకు కృతజ్ఞతుడిని. నా అనుభవం, నాలెడ్జ్ను యువ ఆటగాళ్లకు చెప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ఇప్పుడు నాపై కొత్త బాధ్యతలు ఉన్నాయి. ఇదొక అవకాశం తీసుకొని సవాళ్లను ఎదుర్కొంటా. అలాగే ఆటను ఆస్వాదిస్తా. అయితే నా లక్ష్యం మాత్రమే 2023 వన్డే ప్రపంచకప్. దాని కోసం నేను ఫిట్గా ఉండటంతోపాటు నా మనస్సును మంచి స్థితిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా'' అని ధావన్ వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ గెలిచిన రోహిత్ సేన ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కగా... మరోవైపు శిఖర్ ధావన్ సారథ్యంలో భారత ద్వితీయ శ్రేణి జట్టు వన్డే సమరానికి సిద్దమైంది. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో దేశవాళీ, ఐపీఎల్ స్టార్స్ తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. ఇండియా-ఏ, దేశవాళీ క్రికెట్తో మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లు.. అంతర్జాతీయ స్థాయిలో అదే జోరును కొనసాగించాలనుకుంటున్నారు. ధావన్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వనుండగా.. ప్రపంచకప్ స్టాండ్ బై లిస్ట్లో ఉన్న సిరాజ్, దీపక్ చాహర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. మరోవైపు రజత్ పటీదార్, షెహ్బాజ్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి వంటి దేశీయ స్టార్లు అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు.