మొహాలీ: చెత్త బ్యాటింగ్తోనే మరో మ్యాచ్లో ఓటమిపాలయ్యామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శిఖర్ ధావన్ జట్టు బ్యాటింగ్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
టీ20 ఫార్మాట్లో బంతులను డాట్ చేయడం నేరమని, అలాంటిది తమ జట్టు ఏకంగా 56 బంతులను డాట్ చేసిందన్నాడు. ఇంత చెత్తగా బ్యాటింగ్ చేసిన తర్వాత ఓడిపోక గెలుస్తామా? అని అసహనం వ్యక్తం చేశాడు. స్వల్ప స్కోరే అయినా.. బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చి.. మ్యాచ్ను చివరి వరకు తీసుకొచ్చారని ప్రశంసించాడు.

'పేలవ బ్యాటింగ్తోనే ఓటమిపాలయ్యాం. ఈ మ్యాచ్లో మా బ్యాటింగ్ మరి దారుణంగా ఉందని ఒప్పుకుంటా. ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచలేకపోయాం. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తాం. ఈ మ్యాచ్లో మేం ఆడిన డాట్ బాల్స్ చూస్తేనే మా బ్యాటింగ్ వైఫల్యం అర్థం అవుతోంది. 56 బంతులను డాట్ చేసినప్పుడు ఏ జట్టుకైనా ఓటమే ఎదురవుతుంది.
ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే ఒత్తిడి నెలకొంటుంది. శుభారంభాలు అందించడంపై మేం వర్క్ చేయాల్సి ఉంది. బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. పోరాడే లక్ష్యం లేకపోయినా.. అసాధారణ బౌలింగ్తో మ్యాచ్ను ఉత్కంఠగా మార్చారు. లియామ్ లివింగ్ స్టోన్ బుధవారమే జట్టుతో కలిసాడు. మైదానంలోకి అడుగుపెట్టేందుకు కాస్త సమయం పడుతోంది.'అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్(24 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 36), జితేశ్ శర్మ(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. షమీ, జోష్ లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి మరో బంతి మిగిలుండగానే విజయాన్నందుకుంది. శుభ్మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 67) హాఫ్ సెంచరీతో రాణించగా.. వృద్దిమాన్ సాహా(19 బంతుల్లో 5 ఫోర్లతో 30), డేవిడ్ మిల్లర్(17 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్, రబడా, సామ్ కరణ్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ తీసారు.