
న్యూఢిల్లీ: టీనేజీ వయసులో తాను చేసిన ఓ తింగరి పనికి తన తండ్రి చితక్కొట్టాడని టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. హెచ్ఐవీ టెస్ట్ కూడా చేయించాడని గుర్తు చేసుకున్నాడు. పేలవ ఫామ్, యువ ఆటగాళ్లు సత్తా కనబర్చడంతో టీమిండియాకు దూరమైన శిఖర్ ధావన్.. ఐపీఎల్ 2023 సీజన్పైనే నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సీజన్లో సత్తా చాటి మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని, వన్డే ప్రపంచకప్ ఆడి ఆటకు వీడ్కోలు పలకాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్.. ఆటతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
తనకు టాటూస్ వేసుకోవడం చిన్నప్పటి నుంచి ఇష్టమని, ఓసారి తన తల్లిదండ్రులకు తెలియకుండా టాటూ వేసుకున్నందుకు తన తండ్రి చితక్కొట్టాడని తెలిపాడు. టాటూల వల్ల లేని పోనీ రోగాలు వస్తాయని, హెచ్ఐవీ టెస్ట్ కూడా చేయించాడని గుర్తు చేసుకున్నాడు. 'నాకు 14-15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా ఫ్యామిలీతో మనాలీ ట్రిప్ వెళ్లాను.
అప్పుడు మా కుటుంబ సభ్యులకు తెలియకుండా.. నా వీపు మీద టాటూ వేయించుకున్నాను. కొన్ని రోజుల పాటు నేను టాటూ వెయించుకున్నట్లు సంగతి ఎవ్వరికి తెలియనివ్వలేదు. అలా 3-4 నెలలు గడిచిన తర్వాత ఓ రోజు నా టూటూను మా నాన్న చూశాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన చితక్కొట్టాడు. టాటూల వల్ల లేని పోని రోగాలు వస్తాయని భయపెట్టాడు.
ఆయన మాటలతో నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకంటే.. నాకు టాటూ వేసిన సూదీతోనే.. ఇంకా ఎందరికి టాటూ వేసి ఉంటారో నాకు తెలియదు కదా. అందుకే నాలోనూ కాస్త భయం ప్రారంభమైంది. నేను భయపడుతున్నది తెలుసుకున్న మా నాన్న నాకు హెచ్ఐవీ టెస్ట్ చేయించారు. అదృష్టవశాత్తు నెగటివ్ వచ్చింది. ఇక నేను మొదటగా వేసుకున్న టాటూ తేలు బొమ్మ. అప్పుడు నా ఆలోచన అలానే ఉండేది. ఆ తర్వాత దాని మీద డిజైన్ వేయించాను. నా చేతి మీద శివుడి టాటూ వేయించుకున్నాను. అలానే అర్జునుడి టాటూ కూడా వేయించుకున్నాను'' అని తెలిపారు.
ప్రస్తుతం ఐపీఎల్-2023 కోసం సిద్ధమవుతున్న ధావన్... ఈసారి పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మయాంక్ అగర్వాల్ స్థానంలో ధావన్కు పంజాబ్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1న కోల్కతా నైట్రైడర్స్తో జరిగే తొలి మ్యాచ్తో పంజాబ్ తమ క్యాంపైన్ను మొదలుపెట్టనుంది.