
న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరుగుతున్న కీలక ఫైనల్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్పై మాయిశ్చర్ ఉండటంతోనే చేజింగ్కు మొగ్గు చూపానని భారత తాత్కలిక సారథి శిఖర్ ధావన్ తెలిపాడు. మాయిశ్చర్ కారణంగా ఆరంభంలో పేసర్లకు అనుకూలిస్తుందని చెప్పాడు. గత మ్యాచ్లో తమ ఆటగాళ్లు సత్తా చాటారని, ముఖ్యంగా యువ ఆటగాళ్లు చాలా పరణితితో ఆడారని తెలిపాడు. ఈ కారణంగానే ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయాలని భావించిన యువ ప్లేయర్లు రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ముకేశ్ కుమార్లకు నిరాశే ఎదురైంది.
ఇక అనారోగ్యంతో రెండో వన్డేకు దూరంగా ఉన్న సౌతాఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా ఈ మ్యాచ్ కూడా ఆడటం లేదు. అనారోగ్యం నుంచి కోలుకున్నా.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అతను, షంసీలు ఈ మ్యాచ్ కూడా ఆడటం లేదు. దాంతో డేవిడ్ మిల్లర్ ఈ మూడో వన్డేలో సౌతాఫ్రికా జట్టును నడిపిస్తున్నాడు. ఇక సౌతాఫ్రికా జట్టుకు సారథ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపిన మిల్లర్.. టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు. జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయని, మార్కో జాన్సెన్, అండిలే, లుంగి ఎంగిడిలు జట్టులో వచ్చారని చెప్పాడు. మైదానం తడిగా ఉండటంతో ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్లో కొద్ది తేడాతో ఓడిన భారత్.. రెండో వన్డేలో సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి సిరీస్ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. భారత్ కన్నా కూడా దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్లో విజయం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ జట్టు 2023 వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించకపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఐసీసీ ప్రపంచకప్ సూపర్ లీగ్లో మే నాటికి తొలి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లకు నేరుగా ప్రపంచకప్లో ఆడే అవకాశం లభిస్తుంది. మిగతా జట్లు క్వాలిఫయర్స్ ఆడాల్సివస్తుంది.
దక్షిణాఫ్రికా ప్రస్తుతం 11వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ గెలిస్తే పది పాయింట్లు ఖాతాలో వేసుకుని 9వ స్థానానికి చేరుకుంటుంది. ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్ కన్నా 9 పాయింట్లు తక్కువతో ఉంటుంది. ఈ సిరీస్ ముగిశాక అయిదు మ్యాచ్లు ఆడాల్సివున్న దక్షిణాఫ్రికా ఇక్కడ పది పాయింట్లు సాధిస్తే.. ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు మెరుగవుతాయి. కానీ చివరి వన్డేలో భారత్ను అడ్డుకోవడం ఆ జట్టుకు సవాలే. కెప్టెన్ బవుమా పేలవ ఫామ్ దక్షిణాఫ్రికాకు పెద్ద ప్రతికూలాంశం
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావర్(కెప్టెన్), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, షెహ్ బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్(కీపర్), జెన్నెమన్ మలాన్, రిజా హెండ్రీక్స్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, అండిలో పెహ్లుక్వాయో, బ్జోర్న్ ఫర్చూన్, అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడి