టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తొలిసారి చూసినప్పుడు బాలీవుడ్ హీరోలా కనిపించాడని మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. తన ఆత్మకథ 'ద వన్ క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్'లో పేర్కొన్నాడు. ఈ బుక్లో శిఖర్ ధావర్ జ్ఞాపకాలతో పాటు లవ్ ఎఫైర్స్, స్నేహాల గురించి.. మైదానం లోపల, బయట తన చుట్టూ ఉన్న వివాదాల గురించి ప్రస్తావించాడు. ధోనీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'ధోనీని తొలిసారి చూసినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అతను నాకు బాలీవుడ్ హీరోలా కనిపించాడు. ముఖ్యంగా అతని పొడవాటి జుట్టు, చిరు నవ్వుతో సినిమా స్టార్ను తలపించాడు. దాంతోనే ధోనీని బాలీవుడ్ సినిమాలో నటింపజేయాలనుకున్నాను. ధోనీని తొలిసారి కలిసినప్పుడు ఇదే విషయాన్ని అతనితో చెప్పాను. నేను భారత జట్టుకు ఆడాలనుకుంటున్నాను. అలాగే నిన్ను బాలీవుడ్ హీరో చేయాలనుకుంటున్నానని చెప్పాను. ఆ మాటలకు ధోనీ వెనక్కి వాలి నవ్వుకున్నాడు.

కెరీర్ పరంగా నాకు ధోనీ ఎంతో మద్దతు ఇచ్చాడు. 2015 వన్డే ప్రపంచకప్ ముందు నా ప్రదర్శన బాలేకపోయినా.. నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించాడు. అతని సహకారం నా మానసిక స్థితిని మార్చేసింది.
సిడ్నీలోని బ్రహ్మకుమారీస్ ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత ధోనీని ఏం చేశావని అడిగాను. దానికి అతను రిలాక్స్ అయ్యానని, ధ్యానం చేశానని చెప్పాడు. ధోనీ ఓ దిగ్గజ, స్పూర్తిదాయకపమైన కెప్టెన్.'అని గబ్బర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు.
తాను టీమిండియాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సోషల్ మీడియా ప్రభావం లేదని, అప్పుడప్పుడే మొదలైందని ధావన్ తెలిపాడు. అప్పట్లో క్రికెటర్లపై దృష్టి మరీ ఎక్కువగా ఉండేది కాదని, జట్టు ఎంపిక ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలపై చర్చలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించేదని గుర్తు చేసుకున్నాడు. కానీ ప్రస్తుత కాలంలో ఓ క్రికెటర్ రాత్రికి రాత్రే హీరో నుంచి జీరో కావచ్చిని అభిప్రాయపడ్డాడు. భారత్ తరఫున 34 టెస్ట్లు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన శిఖర్ ధావన్.. మూడు ఫార్మాట్లలో 10వేలకు పైగా పరుగులు చేశాడు.