
న్యూఢిల్లీ: భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడాన్ని గొప్పగా భావిస్తున్నానని శిఖర్ ధావన్ తెలిపాడు. వచ్చె నెలలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. 20 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు శిఖర్ ధావన్ను కెప్టెన్గా, భువనేశ్వర్ కుమార్ను వైస్ కెప్టెన్గా నియమించింది.
టీమిండియా కెప్టెన్గా అవకాశం కల్పించడంపై సోషల్ మీడియా వేదికగా శిఖర్ ధావన్ స్పందించాడు. సదరు నిర్ణయాన్ని గొప్పగా భావిస్తున్నట్లు తెలిపాడు.
"దేశానికి నాయకత్వం వహించడం గొప్పగా భావిస్తున్నా. మీ అందరి విషెస్కు ధన్యవాదాలు" అని ధావన్ ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు 34 టెస్టులతో పాటు 145 వన్డేలు, 65 టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన గబ్బర్.. తొలి సారి జట్టును నడిపించబోతున్నాడు. జూలై 13 నుంచి 25 వరకు మూడు టీ20, మూడు వన్డేలు ఆడడానికి భారత జట్టు లంకలో పర్యటించనుంది. ఈ జట్టులో ఏకంగా ఐదుగురు కొత్త క్రికెటర్లు ఎంపికయ్యారు.
ఐపీఎల్లో సత్తాచాటిన యంగ్ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్.. రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణాతో పాటు స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్, యంగ్ పేసర్ చేతన్ సకారియా తొలిసారి నేషనల్ టీమ్లోకి వచ్చారు. టెస్ట్ల్లో ప్లేస్ కోల్పోయిన పృథ్వీషా వైట్ బాల్ ఫార్మాట్లో చాన్స్ దక్కించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, యుజ్వేద్ర చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్ స్పిన్నర్ల కోటాలో ఎంపికయ్యారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. ఈ రెండో జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. అయితే ఈ జట్టుకు ఎన్సీఏ చీఫ్, భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించే అవకాశం ఉంది.