
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ట్విటర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు. భారత జట్టు జెర్సీ వేసుకొని పదేళ్లు అయిన సందర్భంగా గబ్బర్ స్పందించాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'టీమిండియాతో నా ప్రయాణం పదేళ్లు. నా దేశం కోసం ఆడుతున్నాను. ఇంతకంటే గొప్ప గౌరవం ఏది ఉండదు. నా మాతృభూమికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది. సదా నేను కృతజ్ఞుడిని' అని ధావన్ ఏమోషన్ అయ్యాడు.
2004 అండర్ 19 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన (505 పరుగులు)తో అందరి దృష్టి ఆకర్షించిన ధావన్.. సెహ్వాగ్, సచిన్ల కారణంగా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఎట్టకేలకు 2010, అక్టోబర్ 20న వన్డే మ్యాచ్తో భారత జట్టు తరఫున అంతర్జాయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అయితే తన ఫస్ట్ మ్యాచ్లో గబ్బర్ డకౌటయ్యాడు. ఆ తర్వాత తన విధ్వంసకర బ్యాటింగ్తో ఓపెనర్గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ఇప్పటి వరకూ 136 వన్డేల్లో 5,688 పరుగులు చేసిన ధావన్.. 34 టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. 61 టీ20 మ్యాచ్లాడి 1,588 రన్స్ సాధించాడు. ఐసీసీ టోర్నీల్లో గబ్బర్కు మంచి రికార్డు ఉంది. ఈ మెగాటోర్నీల్లో 18 మ్యాచులాడిన ధావన్ 65.47 సగటుతో 1,113 పరుగులు చేశాడు. అందులో 5 శతకాలు, 4 అర్ధశతకాలున్నాయి.
ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్.. సూపర్ ఫామ్తో దూసుకుపోతున్నాడు. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో 50కిపైగా పరుగులు చేశాడు. అంతేకాకుండా గత రెండు మ్యాచ్ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసి.. ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాట్స్మన్గా నయా రికార్డు లిఖించాడు. అయితే ధావన్ సెంచరీ చేసినా పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓడింది.