జూలై 8న శ్రీలంకకు..
ఈ పర్యటనలో భారత్.. ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్లో ఉండటంతో.. శ్రీలంక పర్యటనకు ఐపీఎల్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో కూడిన మరో జట్టును పంపించనుంది. ఇప్పటికే ఈ సిరీస్కు సంబంధించి బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ హింట్ ఇచ్చాడు. ఇక శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైందని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో పేర్కొంది. ఇరు బోర్డుల సమాచారం ప్రకారం భారత జట్టు జూలై 5న శ్రీలంకలో అడుగుపెట్టి 28న తిరుగు పయనంకానుంది.
మిక్స్డ్ క్వారంటైన్..
అయితే ఈ పర్యటనకు బయలు దేరే సమయానికి ఆటగాళ్లందరికి వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నారు. దాంతో వీరంతా లంకలో మూడు రోజులు హార్డ్ క్వారంటైన్.. మరో నాలుగు రోజులు సాఫ్ట్ క్వారంటైన్లో ఉండనున్నారు. తొలి మూడు రోజులు హోటల్ గదులకే పరిమితమవ్వాల్సి ఉంటుంది. ఈ మూడు రోజుల్లో చేసిన కరోనా పరీక్షల్లో నెగటీవ్ వచ్చిన ఆటగాళ్లను సాఫ్ట్ క్వారంటైన్లోకి అనుమతిస్తారు. సాఫ్ట్ క్వారంటైన్లో ఇతర ఆటగాళ్లను కలుసుకోవడంతో పాటు మైదానంలో ప్రాక్టీస్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది.
తేదీలు ఖారారు..
జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. అయితే కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఇప్పటికే వేదికలను కూడా ఖారారు చేసింది. ఇక ఈ సిరీస్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్ తదితరులు దూరం కానున్నారు. దాంతో సెలెక్టర్లు ఈ సిరీస్కు ఐపీఎల్లో సత్తా చాటిన ఇండియా ఏ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించే అవకాశం ఉంది.
శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమ్ (అంచనా)
శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, పృథ్వీ షా, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, జయదేవ్ ఉనాద్కత్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, రాహుల్ తెవాటియా, హర్షల్ పటేల్ తదితర ఆటగాళ్లు.