'ఇంట గెలిచి రచ్చ గెలవాలి'అనేది పెద్దల మాట. కానీ టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది. రచ్చ గెలిచిన గబ్బర్.. ఇంట్లో ఓటమిపాలయ్యాడు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భాగస్వామి మనసును గెలుచుకోలేకపోయాడు. 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్కు శిఖర్ ధావన్ శనివారం వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
టీమిండియా క్రికెటర్గా తన కెరీర్ సంతృప్తికరంగా సాగిందని గబ్బర్ చెప్పుకొచ్చాడు. తనకు అండగా నిలిచి బీసీసీఐ, డీడీసీఏ, అభిమానులు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. భారత్ సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో కీలకమైన గబ్బర్ ఆటకు అల్విదా ప్రకటించడంతో హాట్ టాపిక్గా మారాడు. జీవితంలో క్రికెటర్గా సూపర్ సక్సెస్ సాధించిన శిఖర్ ధావన్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు.

ఛీకొట్టిన ఆయేషా ముఖర్జీ..
ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని సతీమణి ఆయేషా ముఖర్జీ.. శిఖర్ ధావన్ను ఛీకొట్టి దూరంగా వెళ్లిపోయింది. పశ్చిమ బెంగాల్కి చెందిన ఆయేషా ముఖర్జీ కుటుంబం ఆమె 8 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో స్థిరపడింది. కిక్ బాక్సింగ్లో ప్రావీణ్యం పొందిన ఆయేషా .. జాతీయ స్థాయి కిక్ బాక్సర్గా ఎదిగింది.
శిఖర్ ధావన్ను వివాహం చేసుకోవడానికి ముందు ఆయేషా.. ఆస్ట్రేలియాలోని ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు. కొన్నాళ్లకే వారి వైవాహిక బంధానికి తెరపడింది. ఆయేషా ముఖర్జీతో శిఖర్ ధావన్కు ఫేస్బుక్ ద్వారా పరిచమైంది. ఈ ఇద్దరికి కామన్ ఫ్రెండ్ హర్భజన్ సింగ్. ఫేస్బుక్లో ఆయేషా ఫోటో చూసి ప్రేమలో పడిన గబ్బర్.. ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపాడు.
భజ్జీ కామన్ ఫ్రెండ్..
ఈ విషయం హర్భజన్తో మాట్లాడిన అనంతరం ధావన్ రిక్వెస్ట్కు ఆయేషా ఒకే చెప్పింది. ఆ తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.
అయితే వీరి పెళ్లికి ధావన్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. గబ్బర్ కంటే ఆయేషా దాదాపు 10 ఏళ్లు పెద్దది కావడం, అప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో పెళ్లి నిరాకరించారు. 2009లో ఇంటి నుంచి బయటకు వచ్చిన గబ్బర్.. 2012లో ఆయేషాను పెళ్లి చేసుకున్నాడు. 2014లో వీరికి జోరవర్ పుట్టాడు.
ఆయేషా కూతుళ్లను కూడా గబ్బర్ తన పిల్లల్లానే చూసుకున్నాడు. వారిని ఆస్ట్రేలియాలోనే ఉంచి చదివించాడు. సెలవులు దొరికినప్పుడు ఇంటికి వచ్చేవారు. లాక్ డౌన్ సమయంలోనూ ఆయేషాతో పాటు వారి కూతుళ్లతో గబ్బర్ టిక్ టాక్ వీడియోలు చేశాడు. ఏమైందో ఏమో కానీ చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట.. 2021లో విడిపోయింది. జోరావర్ను చూసేందుకు కూడా తన మాజీ సతమణీ అనుమతి ఇవ్వడం లేదని గబ్బర్ చాలా ఇంటర్వ్యూల్లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయేషాతో విడిపోయిన తర్వాత గబ్బర్ కెరీర్ గ్రాఫ్ కూడా పడిపోయింది. వరుస గాయాలతో టీమిండియాలో చోటు కోల్పోయాడు.