
కొలంబో: శ్రీలంకతో తొలి టీ20లో 10-15 పరుగులు తక్కువ చేసినా బౌలర్ల అద్భుత ప్రదర్శనతోనే విజయం సాధించామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 38 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శిఖర్ ధావన్.. యువ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడని, తనపై నెలకొన్న ఒత్తిడి తగ్గించాడని కొనియాడాడు. అరంగేట్ర మ్యాచ్లోనే వరుణ్ చక్రవర్తీ అదరగొట్టాడని, అతని బౌలింగ్ను ఆడటం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు.
'మేం 10-15 పరుగులు తక్కువ చేసాం. అయినా పోరాడే లక్ష్యమని భావించాం. తొలి బంతికే వికెట్ కోల్పోయినా తర్వాత మేం బాగా ఆడాం. పవర్ ప్లేలో 50 పరుగులు జోడించాం. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఆటగాడు. అతని బ్యాటింగ్ను మేం ఆస్వాదిస్తాం. అతను తన హిట్టింగ్తో నాపై నెలకొన్న ఒత్తిడిని తగ్గించాడు. శ్రీలంక అద్భుతంగా ఆడినప్పటికీ మా స్పిన్నర్లు అద్బుతం చేస్తారని మాకు తెలుసు. యుజ్వేంద్ర చాహల్, కృనాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న వరుణ్ అదరగొట్టాడు. అతని బౌలింగ్ను ఎదుర్కోవడం చాలా కష్టం. నెట్స్లో నేను కూడా ఇబ్బంది పడుతా. పృథ్వీషా అద్బుతమైన ఆటగాడు. ఈ మ్యాచ్లో విఫలమైనప్పటికీ.. బౌన్స్ బ్యాక్ అవుతాడు'అని గబ్బర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 50)హాఫ్ సెంచరీతో రాణించగా.. శిఖర్ ధావన్(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం శ్రీలంక 18.3 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. చరిత్ అసలంక(44), అవిష్కా ఫెర్నాండో(26) మినహా అంతా విఫలమయ్యారు. భువనేశ్వర్ కుమార్ (4/22) నాలుగు వికెట్లతో లంక పతనాన్నిశాసించగా.. దీపక్ చాహర్(2/24) రెండు, వరుణ్ చక్రవర్తీ(1/28), యుజ్వేంద్ర చాహల్(1/19), హార్దిక్ పాండ్యా(1/17), కృనాల్ పాండ్యా(1/16)తలో వికెట్ తీశారు.