
ఇది సమిష్టి విజయం..
'జట్టుగా ఇదో అద్బుతమైన ప్రదర్శన. ఈ మ్యాచ్లో మేం తప్పిదాలు చేశాం. కానీ వాటిని సవాళ్లుగా స్వీకరించాం. ఏ పరిస్థితుల్లోనూ మా ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. విజయంపై నమ్మకం కోల్పోలేదు. ఇది నన్ను కాస్త ఆశ్చర్యనాకి గురిచేసింది. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. వారికి నా హ్యాట్సాఫ్. అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్ అద్భుతంగా ఆడారు.
చివర్లో ఆవేశ్ ఖాన్ చేసిన 11 పరుగులు జట్టు విజయానికి కలిసొచ్చాయి. భారత డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్ కారణంగానే టీమిండియా ఇలాంటి విజయాలు సాధించగలుగుతోంది. అక్కడ భారీ జన సమూహం ముంగిట ఆడటం.. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అంతర్జాతీయ క్రికెట్కు సహకరిస్తోంది.

వాళ్లే ఆడినప్పుడు...
వెస్టిండీస్ బ్యాటింగ్లో అదరగొట్టింది. షై హోప్, పూరన్ చెలరేగారు. అయితే వాళ్లే రాణిస్తున్నప్పుడు తమకు బ్యాటింగ్ పెద్ద కష్టం కాదనిపించింది. అయితే మేం నెమ్మదిగా ప్రారంభించాం. శుభ్మన్ అద్భుతంగా ఆడాడు. సంజూ-అయ్యర్ భాగస్వామ్యం భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. శాంసన్ సిల్లీగా రనౌట్ అయినప్పటికీ ఆటలో ఇలాంటివి సహజం.
కుర్రాళ్లు ఇలాంటి తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. సపోర్ట్ స్టాఫ్కు ధన్యవాదాలు. వారు వారి బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. ఇక 100వ మ్యాచ్లో 100 కొట్టడమనేది గొప్ప విషయం. నేను కూడా నా 100వ మ్యాచ్లో సెంచరీ చేశా. ఈ ఘనతను అందుకున్న హోప్కు నా అభినందనలు. అతనో క్వాలిటీ ప్లేయర్. అతనికి మంచి భవిష్యత్తు ఉంది'అంటూ ధావన్ కొనియాడాడు.

హోప్, పూరన్ విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. కెరీర్లో 100వ వన్డే ఆడిన ఓపెనర్ షై హోప్(135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 115) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 74) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. దీపక్ హుడా, చాహల్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 312 పరుగులు చేసి 2 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(13) విఫలమైనా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్(49 బంతుల్లో 5 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు.

మెరిసిన మిడిలార్డర్..
ఇక శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 63), సంజూ శాంసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో దీపక్ హుడా సాయంతో అక్షర్ పటేల్ ధాటిగా ఆడాడు. హుడా వెనుదిరిగినా.. సిరాజ్(1 నాటౌట్) సాయంతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.
క్రీజులో సిరాజ్ ఉండటంతో విజయం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ వరుసగా మూడు బంతులు సింగిల్ తీసిన అక్షర్.. నాలుగో బంతికి భారీ సిక్సర్తో ఇన్నింగ్స్ ముగించాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్ రెండేసి వికెట్లు తీయగా.. సీల్స్, రొమారియో, అకీల హోసిన్ తలో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications












