
న్యూఢిల్లీ: టీమిండియా తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ధావన్.. రోహిత్ శర్మ గైర్హాజరీలో జట్టును నడిపించనున్నాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్న ధావన్.. కెరీర్లో రెండోసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గతేడాది శ్రీలంక పర్యటనలో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన అతడు ఇప్పుడు మరోసారి ఆ బాధ్యతలను చేపట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ విండీస్తో వన్డే సిరీస్కు ధావన్ను కెప్టెన్గా ఎంపిక చేసింది.
మరోవైపు ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో విఫలమైన ధావన్ ఈ సిరీస్లో రాణించి జట్టులో తనదైన ముద్రవేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతని ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీలకు చెందిన రికార్డులు ఉన్నాయి. ఈ సిరీస్లో మొత్తం మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో గబ్బర్కు అరుదైన అవకాశం లభించింది. అతడు ఈ మూడు మ్యాచ్లు ఆడితే టీమిండియా తరఫున వెస్టిండీస్ గడ్డపై అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా నిలవనున్నాడు.
ఈ జాబితాలో మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ అత్యధికంగా 15 మ్యాచ్లు ఆడి అందరికన్నా ముందున్నారు. తర్వాత రోహిత్, యువరాజ్ సింగ్, ధావన్ తలా 14 మ్యాచ్లు ఆడి తర్వాతి స్థానంలో ఉన్నారు. దీంతో ధావన్ ఈ సిరీస్లో ఎలాంటి గాయాలబరిన పడకుండా మూడు మ్యాచ్లు ఆడితే మొత్తం 17 మ్యాచ్లు పూర్తి చేసుకుంటాడు. దీంతో కోహ్లీ, ధోనీల కన్నా అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు.
అదే సమయంలో ఈ మూడు మ్యాచ్ల్లోనూ బ్యాట్తో చెలరేగితే.. మరోసారి ధోనీ, రోహిత్లను అధిగమిస్తాడు. ఈ సిరీస్లో గబ్బర్ ఇంకో 110 కన్నా ఎక్కువ పరుగులు సాధిస్తే.. విండీస్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ జాబితాలో కోహ్లీ (790) తర్వాత రెండో స్థానంలో నిలుస్తాడు. ప్రస్తుతం ధోనీ 458, యువరాజ్ 419, రోహిత్ 408 పరుగులతో ఉండగా.. ధావన్ (348) పరుగులతో ఉన్నాడు.