
న్యూఢిల్లీ: టీమిండియాలో చోటు కోల్పోవడంపై వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు. జీవితంలో ఇలాంటి ఎత్త పల్లాలు సహజమని తెలిపిన ధావన్.. తనకంటే మెరుగైన ఆటగాడు రావడంతో జట్టులో చోటు కోల్పోయానని తెలిపాడు. మళ్లీ జట్టులోకి వస్తాననే నమ్మకం తనకు ఉందని, దాని కోసం కష్టపడుతున్నానని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శిఖర్ ధావన్.. వన్డే జట్టులో చోటు కోల్పోవడంపై స్పందించాడు.
'జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. సమయం, అనుభవం చాలా విషయాల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పుతుంది. నేను అత్యుత్తమంగా ఆడాను. కానీ.. వేరొకరు నా కంటే మెరుగ్గా ఆడారు. అందుకే నాకు జట్టులో చోటు దక్కలేదు. అయితే.. ఎప్పటికైనా మళ్లీ జట్టులో చోటు దక్కించుకుంటాను'అని ధావన్ ధీమా వ్యక్తం చేశాడు.
శిఖర్ ధావన్ గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ -2023 టోర్నీ జరగనుండగా.. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే గబ్బర్ ఈ మెగా టోర్నీలో ఆడటం సందేహంగానే కనిపిస్తోంది. శిఖర్ ధావన్ స్థానంలో యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్కి టీమిండియా మేనేజ్మెంట్ వరుస అవకాశాలిస్తోంది. ఆస్ట్రేలియాతో మార్చిలో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్కి కూడా గిల్ ఓపెనర్గా ఎంపికవడం లాంఛనమే. దానికి కారణం శుభమన్ గిల్ చివరి ఏడు ఇన్నింగ్స్ల్లో ఏకంగా 4 సెంచరీలు బాదేయగా.. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది.
నవంబర్లో భారత్ జట్టుకు సారథిగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో జట్టును నడిపించిన శిఖర్ ధావన్.. ఆ తర్వాత బంగ్లాదేశ్తో డిసెంబరులో జరిగిన సిరీస్లోనూ ఆడాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ సెలెక్టర్లు గబ్బర్ను పట్టించుకోవడం లేదు. గత ఐదేళ్ల నుంచి టెస్టులకి దూరంగా ఉంటున్న శిఖర్ ధావన్.. 2021 నుంచి టీ20 జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే.. వన్డే టీమ్లో మాత్రం గత ఏడాది చివరి వరకూ శిఖర్ ధావన్కి అవకాశం లభించింది. కానీ.. గిల్ రాకతో అతడ్ని సెలెక్టర్లు పక్కన పెడుతున్నారు.