టీమిండియా మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ను వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఆ మధ్య హల్చల్ చేసింది. తన సతీమణి ఆయేషా ముఖర్జీతో శిఖర్ ధావన్ విడాకులు తీసుకున్న అనంతరం ఈ ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ వార్తలపై అప్పట్లో అటు మిథాలీ రాజ్గానీ.., ఇటు శిఖర్ ధావన్గానీ స్పందించలేదు.
ఆ తర్వాత ఈ ఇద్దరి దిగ్గజ క్రికెటర్ల పెళ్లి గురించి ఎక్కడా చర్చ జరగలేదు. అయితే ఈ పెళ్లి గురించి తాజాగా శిఖర్ ధావన్ స్పందించాడు. జియో సినిమాలో శిఖర్ ధావన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న 'ధావన్ కరంగే'అనే షోలో మిథాలీ రాజ్తో పెళ్లి వార్తలపై పెదవి విప్పాడు.

తన గురించి తాను విన్న విచిత్రమైన పుకారు ఇదేనని తెలిపాడు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు. 'నేను మిథాలీరాజ్ను పెళ్లి చేసుకోబోతున్నాననే వార్తను విన్నాను. నా గురించి నేను విన్న అత్యంత విచిత్రమైన పుకారు ఇది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు.'అని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించిన శిఖర్ ధావన్ గాయంతో సీజన్ మధ్యలోనే జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే టీమిండియాకు దూరమైన ధావన్.. కెరీర్ చివరి దశలో ఉన్నాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్.. వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జెయింట్స్కు మెంటార్గా వ్యవహరిస్తోంది.
ఇక ఫేస్బుక్లో పరిచయమైన ఆయేషా ముఖర్జీని శిఖర్ ధావన్క 2012లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే పెళ్లై ఇద్దరి కూతుళ్లకు ఆయేషా జన్మనిచ్చింది. విడాకులు తీసుకొని తన భర్తకు దూరంగా ఉండగా.. శిఖర్ ధావన్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికి జోరావెర్ అనే కుమారుడు జన్మించాడు.
ప్రస్తుతం శిఖర్ ధావన్తో విడాకులు తీసుకున్న ఆయేషా ముఖర్జీ.. అతనికి దూరంగా ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. తన కొడుకు జోరావెర్ను కలవనీయడం లేదని ధావన్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.