భారత క్రికెట్ జట్టును టీమిండియా అని పిలవద్దంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి చెందిన జట్టును టీమిండియా అని పిలవడం సరికాదని, అది ఓ ప్రైవేట్ సంస్థ అంటూ రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని పిటిషనర్ను చివాట్లు పెట్టింది. చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను తిరస్కరించింది.
బీసీసీఐకి చెందిన జట్టును టీమిండియా అని పిలవడం ద్వారా తప్పుడు ప్రభావం పడుతుందని పిటిషనర్ తన పిల్లో పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో వంటి వాటిల్లోనూ బీసీసీఐ టీమ్ను భారత జట్టుగా పిలవడం సరైంది కాదని పిటిషన్లో ప్రస్తావించాడు. ఇలా చేయడం వల్ల ప్రైవేట్ సంస్థకు ఆర్థికపరమైన లబ్ధి చేకూరుతోందని అందులో తెలిపారు.

అయితే ఈ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రీడలకు సంబంధించిన పద్దతి ఎలా ఉందో తెలుసా? అని పిటిషనర్ను ప్రశ్నించింది. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ రూల్స్పై అవగాహన ఉందా? అని చివాట్లు పెట్టింది. ఆ కమిటీలపై కేంద్రం లేదా రాష్ట్రాల జోక్యం ఉండకూడదనేది క్రీడా అసోసియేషన్స్ పాలసీ అనేది తెలుసా? అని అడిగింది. ప్రభుత్వ అధికారులు ఎంపిక చేసిన జట్టే భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలని అంటున్నారని, ఒలింపిక్ కమిటీ పాలసీపై అవగాహన ఉందా? గతంలో ఎప్పుడైనా క్రీడా సమాఖ్యల్లో ప్రభుత్వం కలుగజేసుకున్న సందర్భాలు ఉన్నాయా? అని ఘాటుగా ప్రశ్నించింది.