టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని అంతర్జాతీయ క్రికెట్లో ఆడించాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ డిమాండ్ చేశాడు. అద్వితీయమైన ప్రదర్శనతో అదరగొడుతున్న ఈ 14 ఏళ్ల కుర్రాడిని వీలైనంత త్వరగా భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలని ట్వీట్ చేశాడు. అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ భారీ శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే.
80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్లతో 175 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ గెలుచుకున్నాడు. 15 సిక్స్లు, 15 ఫోర్లతోనే 150 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. వెంటనే వైభవ్ సూర్యవంశీని భారత జట్టులోకి తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. 'వైభవ్ సూర్యవంశీని వీలైనంత త్వరగా ఉన్నత స్థాయి క్రికెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో మనం క్రీజులో 14 ఏళ్ల మేధావిని చూశాం. ఆయన పేరు సచిన్ టెండూల్కర్. ఆ సమయంలో మనం ఆయన ఎంతో కాలం వేచి ఉండేలా చేయలేదు.' అని ఒక కమర్షియల్ ప్రకటనలోని వైభవ్ సూర్యవంశీ ఫొటోను షేర్ చేశాడు. సచిన్ తరహాలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.

సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 1973లో పుట్టిన సచిన్.. 16 ఏళ్ల వయసులో 1989 పాకిస్థాన్ పర్యటనకు ఎంపికయ్యాడు. సాధారణంగా ఆ వయసు ఆటగాళ్లు ఏజ్ క్రికెట్ ఆడుతారు. కానీ సచిన్లోని అపార ప్రతిభను గుర్తించిన నాటి సెలెక్టర్లు వయసుతో సంబంధం లేకుండా జట్టులోకి తీసుకున్నారు.
స్కూల్, ఏజ్ క్రికెట్లో సచిన్ పరుగుల మోత మోగించాడు. స్కూల్ స్థాయిలో తన సహచర ఆటగాడైన వినోద్ కాంబ్లితో కలిసి సచిన్ నెలకొల్పిన భాగస్వామ్యం ఇప్పటికీ ఓ సెన్సేషన్. రంజీ క్రికెట్లో నిలకడగా రాణించడంతో పాటు బ్యాటింగ్లో టెక్నిక్, ఫియర్లెస్ గేమ్ సెలెక్టర్లను ఆకట్టుకుంది. సచిన్ను భారత జట్టులోకి తీసుకోవడం అప్పట్లో సాహోసోపేతమైన నిర్ణయమే.
ఐసీసీ రూల్స్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు కనీస వయసు 15 ఏళ్లు నిండి ఉండాలి. ఒకవేళ ఏదైనా దేశం 15 ఏళ్ల లోపు ఆటగాడిని ఆడించాలి అనుకుంటే, ఐసీసీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ ఆటగాడి మానసిక, శారీరక దృఢత్వాన్ని పరీక్షించిన తర్వాతే ఐసీసీ అనుమతి ఇస్తుంది. ఈ నిబంధనను ఐసీసీ 2020లో ప్రవేశపెట్టింది. ఆటగాళ్ల భద్రత, మానసిక పరిపక్వతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. స
వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత వయస్సు కేవలం 14 ఏళ్లు మాత్రమే. ఐసీసీ నిబంధన ప్రకారం అతను 15 ఏళ్లు నిండిన తర్వాతే అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. వైభవ్ను సచిన్ టెండూల్కర్తో పోల్చినప్పటికీ, ప్రస్తుత కాలంలో పోటీ చాలా ఎక్కువగా ఉంది. దేశవాళీ క్రికెట్లో (రంజీ ట్రోఫీ వంటివి) వైభవ్ సూర్యవంశీ మరింత నిలకడగా రాణించి, తన శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలి. బీసీసీఐ యువ ఆటగాళ్లను నేరుగా జాతీయ జట్టులోకి తీసుకురాకుండా.. ముందుగా అండర్-19, భారత్-ఎ జట్ల ద్వారా రాటుదేలేలా చేస్తుంది. ఆ తర్వాతే అంతర్జాతీయ క్రికెట్లో ఆడిస్తోంది.