టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై పంజాబ్ కింగ్స్ హిట్టర్ శశాంక్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీ అని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశాంక్ సింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ధోనీని తొలిసారి కలిసినప్పుడు తనను గుర్తుపట్టాడని తెలిపాడు.
'ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ ధోనీ. ఆయనో దిగ్గజం. ధోనీని నేను తొలిసారి కలిసినప్పుడు ఆయన నన్ను గుర్తు పట్టారు. అది నాకు చాలా పెద్ద విషయం. ఎందుకంటే ధోనీలాంటి దిగ్గజ ఆటగాడికి మన పేరు తెలియడం కంటే మించిన గొప్ప విషయం ఏం ఉంటుంది. ఆయన నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. అవి నాకు బాగా ఉపయోగపడ్డాయి.' అని శశాంక్ సింగ్ తెలిపాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ఇష్టమని, అతని సారథ్యంలో ఆడటం తన కలని చెప్పాడు. 'ప్రతీ ఒక్కరు రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి సానుకూలంగా చెప్తారు. అతను ఆటగాళ్లకు అండగా ఉంటాడు. వారికి చాలా అవకాశాలు ఇస్తాడు. అతను చాలా తెలివైన కెప్టెన్. అతని ఫీల్డ్ సెటప్ చాలా ఫన్నీగా ఉంటుంది. నేను ఎవరి కెప్టెన్సీలోనైనా ఆడాలనుకుంటే అది రోహిత్ శర్మనే. అతను బోంబేకు చెందినవాడు. ఇప్పటికే అతనితో కలిసి ఒకసారి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. అప్పుడు ఆయన కెప్టెన్ కాదు. అతని సారథ్యంలో ఆడాలని ఉంది. అదే నా కోరిక'అని శశాంక్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లలో శశాంక్ సింగ్ సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. దాంతో అతన్ని పంజాబ్ కింగ్స్ రూ. 5 కోట్లకు తీసుకుంది.