
నీ ముఖానికి అంత సీన్ లేదు..
తనదైన ఆటతో 'లార్డ్ శార్డూల్ ఠాకూర్'గా సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్న అతను ఎన్నో కష్టాలను ధాటి ఈ స్థాయికి చేరాడు. కెరీర్ ప్రారంభంలో గాయాలతో సతమతమయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్కు ఎదుర్కొన్నాడు. కెరీర్ ప్రారంభంలో తన బర్త్ డే నెల కలిసొచ్చేలా జెర్సీ నెంబర్ 10తో బరిలోకి దిగిన శార్దూల్.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. 'నీ ముఖానికి అంత సీన్'అనే ఘాటు విమర్శలు ఎదుర్కొన్నాడు. సచిన్ అభిమానిగా వెంటనే తన తప్పిదాన్ని గుర్తించిన అతను తన జెర్సీ నెంబర్ను 54గా మార్చుకున్నాడు. ఏ అభిమానుల చేత ట్రోలింగ్కు గురయ్యాడో వారి చేత శభాష్ శార్దూల్ అని ప్రశంసలు అందుకున్నాడు.

8 ఏళ్ల వయసు నుంచే..
శార్దూల్ ఠాకూర్ మహారాష్ట్రలోని పాల్గర్లో జన్మించాడు. శార్దూల్ తండ్రి నరేంద్ర ఠాకూర్కు క్రికెట్ అంటే పిచ్చి. 30 ఏళ్ల వరకు అతను క్రికెట్ ఆడాడు. అతని సోదరులు రాష్ట్రస్థాయి క్రికెట్ కూడా ఆడారు. అలా శార్దూల్ కూడా చిన్నప్పటి నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకున్నాడు. తండ్రి కూడా ప్రోత్సహించడంతో క్రికెట్నే కెరీర్గా ఎంచుకున్నాడు. నాలుగో తరగతి చదువుతుండగా.. టాటా కంపెనీ టాలెంట్ హంట్ పేరుతో క్రికెట్ క్యాంప్ నిర్వహించింది. ఈ క్యాంప్ ముంబై క్రికెట్ అధికారులు కూడా వచ్చారు. శార్దూల్ ఆటను చూసి ముగ్డులైన వారు అతనికి ఉన్నత స్థాయి క్రికెట్ కోచింగ్ ఇచ్చి అండర్-13, 15 జట్లలో ఆడించారు. అలా శార్దూల్ ఠాకూర్ క్రికెట్ ప్రయాణం మొదలైంది.

6 బంతుల్లో 6 సిక్స్లు..
2006లో హ్యారిస్ షీల్డ్ టోర్నీలో షార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్లో 6 సిక్స్లు బాదడంతో అతని పేరు ముంబై మొత్తం మారుమోగింది. శ్రీవివేకానంద ఇంటర్నేషన్ స్కూల్ తరఫున బరిలోకి దిగిన అతను హ్యారిస్ షీల్డ్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాదాడు. అతని ఆటకు ముగ్దుడైన దినేశ్ లాడ్ (రోహిత్ శర్మ కోచ్).. శార్దూల్కు ట్రైనింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఏడాది పాటు దినేశ్ లాడ్ ఇంట్లోనే ఉండి శార్దూల్ క్రికెట్ మెళకువలు నేర్చుకున్నాడు. శార్దూల్ సక్సెస్ క్రెడిట్ మొత్తం దినేశ్ లాడ్దేనని అతని తండ్రి నరేంద్ర ఠాకూర్ చెప్పాడంటే అతను ఎంత కీలక పాత్ర పోషించాడో అర్థం చేసుకోవచ్చు.

రోహిత్ నేతృత్వంలో..
ట్రైనింగ్ కోసం శార్దూల్ రోజు 87 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. పాల్గర్ నుంచి ముంబైకి రోజు ట్రైన్లో వెళ్లేవాడు. కిక్కిరిసిన ట్రైన్లో కిట్ బ్యాగ్లతో తీవ్ర అవస్థలు పడ్డాడు. రోజుకు ఏడు గంటలు ప్రయాణం చేసేవాడు. టీనేజ్ వచ్చే వరకు శార్దూల్ ట్రైనింగ్ ఇలానే కొనసాగింది. అండర్-19 టీమ్కు ఎంపికయ్యేవరకు ఇలానే నెట్టుకొచ్చాడు. తన జీవితంలో ఇవి అత్యంత క్లిష్టమైన రోజులని శార్దూల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 2012లో ముంబై తరఫున రోహిత్ శర్మ నేతృత్వంలో రంజీ క్రికెట్లోకి వచ్చిన శార్దూల్.. ఆరంభ సీజన్లో విఫలమయ్యాడు. తదుపరి 2013-14 సీజన్లో 27 వికెట్లతో పర్వాలేదనిపించాడు. ఇక 2014-15 సీజన్లో 10 మ్యాచ్ల్లో 48 వికెట్లతో రికార్డు సృష్టించాడు. ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా వినయ్ కుమార్ సరసన నిలిచాడు. ఆ సీజన్లో ముంబై టైటిల్ గెలిచింది. 2015-16లో ఒకే ఒక మ్యాచ్లో 8 వికెట్లతో సత్తా చాటాడు. ఆ వెంటనే అతనికి టీమిండియా పిలుపుఅందింది.

సచిన్ సలహాతో..
2016 వెస్టిండీస్ టెస్ట్ సిరీస్కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. 2017లో శ్రీలంకతో జరిగిన సిరీస్లో వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అప్పుడే సచిన్ జెర్సీతో బరిలోకి దిగి ట్రోలింగ్కు గురయ్యాడు. 2018 సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. రెండేళ్ల నిరీక్షణ తర్వాత వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో అరంగేట్రం చేసిన శార్దూల్ పట్టుమని 10 బంతులు కూడా వేయకుండా గాయంతో తప్పుకున్నాడు. ఆ గాయంతో మళ్లీ మరో రెండేళ్ల వరకు టెస్ట్ ఆడే అవకాశం రాలేదు. బరువు దక్కించుకుంటే భవిష్యత్తు ఉంటుందన్న సచిన్ సలహాతో ఫిట్నెస్పై దృష్టిసారించిన శార్దూల్.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో..
కీలక ఆస్ట్రేలియా పర్యటనలో బ్రిస్బేన్ టెస్ట్ ముంగిట గాయాలతో సీనియర్ ఆటగాళ్లంతా దూరమైన వేళ అనూహ్యంగా అవకాశం అందుకున్న శార్దూల్.. అద్భుత ప్రదర్శనతో జట్టులో కీలక పాత్ర పోషించాడు. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును శార్దూల్(67) వాషింగ్టన్ సుందర్తో కలిసి ఏడో వికెట్కు 123 పరుగులు జోడించి గట్టెక్కించాడు. బౌలింగ్లోనూ 4 కీలక వికెట్లతో సత్తా చాటి భారత చిరస్మరణీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ పెర్ఫామెన్స్తోనే ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన శార్దూల్ ఫస్ట్ టెస్ట్లో బ్యాటింగ్లో విఫలమైనా.. బౌలింగ్లో రాణించాడు. ఆ తర్వాత గాయంతో రెండు టెస్ట్లకు దూరమయ్యాడు. తాజా ఓవల్లో రెండు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు.


Click it and Unblock the Notifications












