టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బౌలర్ల విషయంలో ధోనీ చాలా కఠినంగా ఉంటాడని, సొంత ప్రణాళికలతో మైదానంలోకి రావాలని చెబుతాడని గుర్తు చేసుకున్నాడు. ధోనీ బౌలర్లకు గోరు ముద్దలు తినిపించడని చెప్పాడు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న శార్దూల్ ఠాకూర్.. తాను లేకున్నా బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలని పదే పదే చెబుతాడని గుర్తు చేసుకున్నాడు. ప్రణాళికలు అమలు కాకపోతే సహాయం చేస్తానని మాత్రమే చెబుతాడని తెలిపాడు.

'ధోనీతో కలిసి ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎందుకంటే అతను ఆటగాడిగా ఎదిగేందుకు అవకాశం ఇస్తాడు. ప్రతీ ఒక్కరిని సొంత ప్రణాళికలతో రావాలని చెబుతాడు. ఆటలో గోరు ముద్దలు తినిపించేందుకు ఏ మాత్రం ఇష్టపడడు. తాను వికెట్ల వెనుకాల లేకపోతే ఏం చేస్తారు? రూమ్లోకి వెళ్లి మీ ఆట గురించి ఆలోచించి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచిస్తాడు. ఆ ప్రణాళికలు వర్కౌట్ కాకపోతే.. తాను జోక్యం చేసుకుంటానని చెబుతాడు.
మూడు ఐసీసీ టైటిళ్లతో పాటు ధోనీ ఎంతో మంది ఆటగాళ్లను భారత క్రికెట్కు అందించాడు. ప్రస్తుత దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కూడా ధోనీనే సిద్దం చేశాడు. వారిని జట్టు నుంచి తప్పించాల్సిన సందర్భాల్లో అండగా నిలిచాడు. 2012 నుంచి ప్రస్తుతం వరకు ఎలా ఆడుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం.'అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ధోనీ.. 2020లో వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ రిటైర్మెంట్పై గత నాలుగేళ్ల నుంచి ఊరిస్తున్నాడు. మధ్యలో రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించి తప్పుకునే ప్రయత్నం చేసినా అతను దారుణంగా విఫలమయ్యాడు. దాంతో మళ్లీ సారథ్య బాధ్యతలు తీసుకున్న ధోనీ.. ఐపీఎల్ 2023 సీజన్లో జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు.
ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్కు సారథ్య బాధ్యతలు ఇవ్వగా.. సీఎస్కే తృటిలో ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. అయినా జడేజా కంటే రుతురాజ్ కెప్టెన్గా మెరుగైన ప్రదర్శనే చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనుండగా.. రిటెన్షన్స్ పాలసీ వచ్చిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ధోనీ తెలిపాడు.