ఎన్నో బంతులు డిఫెండ్ చేశా
సిక్సర్ల కోసం ముందే ఎలాంటి ప్రణాళికలు చేసుకోలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో శార్దూల్ ఠాకూర్ తెలిపాడు. 'అప్పటికే కీలక వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడాను. స్పిన్నర్ నాథన్ లైయన్ బౌలింగ్లో ఎన్నో బంతులు డిఫెండ్ చేశా. అతడు కొన్ని ఫ్లైటెడ్ డెలివరీలు విసురుతున్నాడు. బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫ్లాట్గా, నాకు దూరంగా సంధిస్తున్నాడు. దీంతో పరుగులు సాధించలేకపోయా. అంతేగాక లెగ్ సైడ్లో బౌండరీ లైన్లో ముగ్గురు ఫీల్డర్లను మొహరించాడు. దీంతో భారీ షాట్లు ఆడటానికి ఆలోచించా. ఎందుకంటే.. వికెట్ కోల్పోతే జట్టు మరింత కష్టాల్లో పడుతుంది' అని శార్దూల్ తెలిపాడు.
ఎలాంటి ప్లాన్ చేయలేదు
'మ్యాచ్ సాగుతున్నా కొద్ది నా ఫుట్వర్క్ను మారుస్తూ ఆడాను. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ఫుట్తో బంతులు ఎదుర్కొన్నాను. దీంతో లైయన్ బౌలింగ్ను అర్థం చేసుకున్నాను. ఇక సిక్సర్ కోసం ఎలాంటి ప్లాన్ చేయలేదు. బంతి వేస్తున్నప్పుడు క్రీజు నుంచి బయటకి వచ్చి భారీ షాట్ ఆడానంతే. అంతకుముందు అలాంటి బంతుల్ని ఎదుర్కొన్నా.
దీంతో భారీ షాట్ ఆడటానికి ఇదే సరైన సమయమని భావించా. అది స్టాండ్స్లోకి వెళ్లింది. అర్ధ శతకం పూరైంది' అని శార్దూల్ ఠాకూర్ చెప్పాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో శార్దూల్ అర్ధ శతకంతో పాటు ఏడు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
స్కోరుబోర్డు వైపు అసలు చూడలేదు
సుందర్తో కలిసి నెలకొల్పిన 123 పరుగుల భాగస్వామ్యం గురించి శార్దూల్ మాట్లాడుతూ... 'తొలి ఇన్నింగ్స్లో జట్టు 186/6తో కష్టాల్లో ఉన్నపుడు క్రీజులో అడుగుపెట్టా. మరోవైపు సుందర్ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో నిలబడాలనుకున్నాం. ఆ సమయంలో వికెట్లు కాపాడుకోవడం మాకెంతో ముఖ్యం. ఒక్కో అర్ధగంట బ్యాటింగ్ చేస్తూ పోయాం. స్కోరుబోర్డు వైపు అసలు చూడలేదు.
ప్రత్యర్థి బౌలర్ల గురించి చర్చించుకుంటూ బ్యాటింగ్ కొనసాగించాం. కమిన్స్, హేజిల్వుడ్, స్టార్క్.. ఇలా ఆ పేసర్లు ఎలాంటి బంతులు వేస్తారో అని మాట్లాడుకున్నాం. ఏకాగ్రత కోల్పోయినట్లు అనిపించగానే.. జాగ్రత్తగా ఆడాలని ఒకరికొకరం చెప్పుకున్నాం. అలా మాట్లాడుకోవడంతోనే ఏడో వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగలిగాం' అని పేర్కొన్నాడు.
చెన్నై చేరుకున్న శార్ధూల్
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడేందుకు భారత క్రికెటర్లు చెన్నైకి చేరుకుంటున్నారు. చెన్నైలోని హోటల్లో టీమిండియా మేనేజ్మెంట్కి బుధవారం రిపోర్ట్ చేయాల్సిందిగా భారత క్రికెటర్లకి బీసీసీఐ ఆదేశాలు జారీచేయగా.. ఇప్పటికే ముంబైకి చెందిన రోహిత్ శర్మ, అజింక్య రహానే, శార్ధూల్ ఠాకూర్ అక్కడికి చేరుకున్నారు. ఫిబ్రవరి 5 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది.
విశ్రాంతి తర్వాత.. టీమిండియాపై రెచ్చిపోతా: ఇంగ్లాండ్ ఓపెనర్