
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన నాలుగో టీ20లో టీమిండియా అదరగొట్టింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 8 పరుగులతో తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. ఇంగ్లండ్ విజయానికి చివరి 24 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో గాయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానం వీడగా.. రోహిత్ శర్మ జట్టును నడిపించాడు. అప్పటికే జోరు మీదున్న బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్లను శార్ధూల్ ఠాకూర్ సాయంతో రోహిత్ పెవిలియన్ చేర్చాడు. దాంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లీంది.
అయితే ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. శార్థూల్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ 4, 6 బాదడంతో ఉత్కంఠ పెరిగింది. అతనికి తోడు తీవ్ర ఒత్తిడికి లోనైన శార్దూల్ వరుసగా రెండు వైడ్లతో ఇంకాస్త టెన్షన్ పెట్టాడు. ఈ క్రమంలో శార్దూల్కు రోహిత్ శర్మ అండగా నిలిచాడు. తర్వాత మూడు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన శార్దూల్ భారత్కు అద్భుత విజయాన్నందించాడు. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఇచ్చిన సలహాతోనే తాను రాణించగలిగానని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ శార్దూల్ ఠాకూర్ తెలిపాడు.
"బ్యాట్స్మెన్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు బౌలింగ్ చేయడాన్ని నేను బాగా ఆస్వాదిస్తా. హార్దిక్కు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. కానీ రోహిత్ నా వద్దకు వచ్చి కొన్ని సూచనలు చేశాడు. మైదానం ఓ వైపు బౌండరీ తక్కువ దూరంలో ఉందని అది దృష్టిలో పెట్టుకుని బంతులేయమని తెలిపాడు. పిచ్పై చాలా తేమ ఉంది. చివరి మూడు మ్యాచ్ల్లో ఇలా లేదు. ఇంగ్లండ్ బౌలింగ్ చేసినపుడు బంతి పొడిగా ఉండటం వల్ల సమస్యేమీ రాలేదు. కానీ సెకండాఫ్లో నేను స్లో బాల్ వేయాలనుకున్నపుడు అది సిక్సర్గా వెళ్లింది. బంతి పొడిగా ఉంటే గ్రిప్ తేలికగా ఉండి నకుల్ బాల్ వేయడానికి సులువుగా ఉంటుంది.'అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.
ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెరీర్లో ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఆర్చర్కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్లు), జేసన్ రాయ్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.