భావోద్వేగానికి గురయ్యాం..
'విజయానంతరం జాతీయ జెండాను చేతబూని మైదానంలో తిరిగినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. ఆ క్షణాన జట్టు సభ్యులంతా అదే ఫీలింగ్కు గురయ్యారు. ఆస్ట్రేలియాలోనూ ఎంతో మంది భారతీయులు మాకు మద్దతుగా నిలిచారు. స్టేడియానికి వచ్చి ప్రోత్సహించారు. వారికి ధన్యవాదాలు తెలపడం మా బాధ్యత. మైదానంలో అభివాదం చేస్తూ వాళ్లకి కృతజ్ఞతలు తెలిపాం. వాళ్లకే కాదు, మేం విజయం సాధించాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాం. ఇక సిరీస్ను 2-1తో ముగించడం ఎంతో ప్రత్యేకం. ప్రత్యర్థి జట్టుకు డెన్గా భావించే గబ్బాలో విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించాం. ఇది గొప్ప అనుభూతి.
విజయం ప్రత్యేకం..
'అడిలైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటయ్యాం. అంతేగాక విరాట్ కోహ్లీ గైర్హాజరీ. దంతో మేం 0-4తో సిరీస్ కోల్పోతామని భావించారంతా. కానీ గొప్పగా పుంజుకుని మెల్బోర్న్ టెస్టులో విజయం సాధించాం. రహానె కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత అద్భుత పోరాటంతో సిడ్నీ టెస్టును డ్రాగా ముగించాం. అది మాకు విజయంతో సమానం. ఇక గబ్బాలో చరిత్ర సృష్టించాం. ఆ క్షణాల్ని ఎంతో ఆస్వాదించాం.'' అని శార్దూల్ చెప్పుకొచ్చాడు. గబ్బా టెస్టులో శార్దూల్ అర్ధశతకం సాధించడంతో పాటు ఏడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అపూర్వ స్వాగతం..
అద్భుత విజయాన్నంతరం ఇంటికి చేరుకున్న తనకు అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించిందన్నాడు. 'నిజంగా అదో క్రేజీ ఫీలింగ్. సంబరాలు చేసుకోవడానికి చాలా మంది వచ్చారు. కారులో కూర్చున్న నన్ను ఊరేగిస్తానన్నారు. కానీ నేను వద్దన్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లో అలాంటివి వద్దని సున్నితంగా తిరస్కరించాను. అందరి ఆరోగ్యాలు ముఖ్యమే, భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పాను. కానీ అందరికీ నో చెప్పలేకపోయాను. కొందరిని కలిసాను. నేను ఇంట్లోకి వెళ్లాక వారంతా పటాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత నా పేరెంట్స్ను చూడటం ఓ విభిన్న అనుభూతిని కలిగించింది. లాక్డౌన్లో 5-6 నెలలు వారితోనే ఉన్నాను. ఆ వెంటనే చాలా కాలం దూరం కావాల్సి వచ్చింది. దాంతో భావోద్వేగానికి గురవ్వడంతో పాటు ఒకింత ఉత్సాహం కలిగింది.