టీమిండియా వెటరన్ పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు సార్లు ట్రేడ్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా ఈ ముంబై క్రికెటర్ నిలిచాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు శార్దూల్ ఠాకూర్ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది. శార్దూల్ ఠాకూర్తో పాటు షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్ను కూడా ముంబై ట్రేడ్ చేసుకుంది. అతన్ని గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకుంది.
ఐపీఎల్ 2017 సీజన్లో శార్దూల్ ఠాకూర్ను తొలిసారి రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ నుంచి తీసుకుంది. 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కోల్కతా నైట్రైడర్స్ ట్రేడింగ్ చేసుకుంది. తాజాగా ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడంతో దాంతో మూడు సార్లు వేలానికి ముందే జట్టు మారిన ఆటగాడిగా శార్దూల్ ఠాకూర్ రికార్డ్ సాధించాడు.

వాస్తవానికి ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అన్సోల్డ్గా నిలిచాడు. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ముందుకు రాలేదు. అయితే సీజన్ ప్రారంభానికి ముందు అతన్ని ఇంజ్యూరీ రిప్లేస్మెంట్గా లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. రూ. 2 కోట్ల కనీస ధర చెల్లించింది. అనూహ్యంగా శార్దూల్ ఠాకూర్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 10 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు ఫిదా అయిన ముంబై ఇండియన్స్ శార్దూల్ ఠాకూర్ను రూ. 2 కోట్ల క్యాష్ డీల్ ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. షెఫెన్ రూథర్ఫోర్డ్ను కూడా ముంబై ఇండియన్స్ రూ.2.6 కోట్ల క్యాష్డీల్ ద్వారా ట్రేడింగ్ చేసుకుంది.
డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. త్వరలోనే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్కు బీసీసీఐ నవంబర్ 15 డెడ్లైన్ విధించింది. శనివారం సాయంత్రం అధికారిక బ్రాడ్కాస్టర్, స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో 10 ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్లను ప్రకటించనున్నారు. రిటెన్షన్ లిస్ట్ గడువు సమీపిస్తుండటంతో ఫ్రాంచైజీలు తమ ట్రేడింగ్ ప్లేయర్ల వివరాలను ప్రకటిస్తున్నాయి.