పాల్గఢ్(మహారాష్ట్ర): టీమిండియా యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ రెండు నెలల తర్వాత తొలిసారిగా శనివారం నెట్స్లో బౌలింగ్ చేశాడు. కరోనా దెబ్బకు కొన్ని నెలలుగా క్రీడా టోర్నీలు నిలిచిపోగా.. ఔట్డోర్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్గా శార్దూల్ నిలిచాడు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్డేడియంలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో శార్దూల్ ప్రాక్టీస్కు అవకాశం దొరికింది.
పాల్గఢ్ జిల్లా బొయిసర్ ప్రాంతంలోని పాల్గఢ్ దహను తాలుకా స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్లోని నెట్స్లో శార్దూల్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. పలువురు డొమెస్టిక్ ప్లేయర్లతో కలిసి ఈ సెషన్లో పాల్గొన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత తన ఫస్ట్ సెషన్లో ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.
ముంబై అండర్-23 బ్యాట్స్మన్ సాయిరాజ్ పాటిల్, ముంబై రంజీ టీమ్ ఓపెనర్ హార్దిక్ తోమర్ ఆ ఐదు ఓవర్లను ఎదుర్కొన్నారు. అయితే.. ఈ ప్రాక్టీస్ సెషన్లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకి అనుగుణంగా సామాజిక దూరాన్ని తాము పాటించినట్లు కూడా ఠాకూర్ స్పష్టం చేశాడు.
'చాలా రోజుల తర్వాత ఈ రోజే మళ్లీ ట్రైనింగ్ మొదలుపెట్టా. అందువల్ల ఐదు ఓవర్లు మాత్రమే వేశా. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ బౌలింగ్ చెయ్యడాన్ని బాగా ఆస్వాదించా. బ్రేక్ వల్ల అంతా కొత్తగా అనిపించింది. టీమిండియా ట్రైనర్ సూచనల మేరకు ఇంటి దగ్గర ఇన్నాళ్లు ఫిట్నెస్ కాపాడుకున్నా. ఈ రోజు జరిగిన సెషన్ పట్ల ఆనందంగా ఉన్నా. కానీ బౌలింగ్లో పాత రిథమ్ రావాలంటే కొంత టైమ్ పడుతుంది.'అని శార్ధూల్ ఠాకూర్ వెల్లడించాడు.
అభిమానులతోనే ఆటకు అందం: రోహిత్ శర్మ