రిజర్వ్ ఆటగాడిగా ఎంపికై:
ఈ నెల 8వ తేదీ నుంచి ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య ప్రారంభమయ్యే తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ ఆరంభం కానుంది. అయితే ఈ టెస్టు సిరీస్కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. చీలమండ శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్న స్టార్ పేసర్ షానన్ గాబ్రియేల్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రిజర్వ్ ఆటగాడిగా ఇంగ్లండ్కు వచ్చిన గాబ్రియేల్.. ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన రెండు వామప్ మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేయడంతో.. టీమ్ మేనేజ్మెంట్ అతడికి అవకాశం ఇచ్చింది.
గాబ్రియేల్ ఎంట్రీపై సంతోషంగా ఉన్నా:
గాబ్రియేల్ జట్టులో చేరడంతో విండీస్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. గాబ్రియేల్, జాసన్ హోల్డర్, కీమర్ రోచ్, చేమర్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ మరియు రేమోన్ రీఫెర్లతో బౌలింగ్ పటిష్టంగా ఉంది. 'గాబ్రియేల్ జట్టులో చేరడంతో సంతోషంగా ఉన్నా. అతడు ఫిట్నెస్ నిరూపించుకుని ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. కచ్చితంగా అతడు రాణిస్తాడు' అని వెస్టిండీస్ సెలెక్టర్ రోజర్ హార్పర్ అన్నాడు.
కరన్కు వైరస్ లక్షణాలు:
ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ కరోనా వైరస్ లక్షణాలతో బాధపడటం ఆ జట్టు ఆటగాళ్లను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రాక్టీస్ గేమ్లో పాల్గొని బ్యాటింగ్ కూడా చేసిన కరన్.. గురువారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మైదానం వదిలి విశ్రాంతి తీసుకున్న అతను.. అర్థరాత్రి డయేరియాతో బాధపడ్డాడు. ఈ నేపథ్యంలో కరన్కు కరోనా పరీక్షలు నిర్వహించామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కరన్ కోవిడ్-19 రిపోర్టులు ఇంకా రాలేదని, అప్పటి వరకు జట్టు డాక్టర్ పర్యవేక్షణలో సెల్ఫ్ ఐసోలేషన్కు ఉంటాడని తెలిపింది.
విండీస్ టెస్టు జట్టు:
జేసన్ హోల్డర్ (కెప్టెన్), బ్లాక్వుడ్, బానర్, బ్రాత్ వైట్, బ్రూక్స్, క్యాంప్బెల్, రోస్టన్ ఛేజ్, కార్న్ వాల్, డౌరిచ్, గాబ్రియేల్, చెమర్ హోల్డర్, షై హోప్, అల్జారీ జోసెఫ్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్.