
సిడ్నీ: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. అద్భుత ప్రతిభ కలిగిన సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచివేసింది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా నిర్మించిన 'ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ' సినిమాలో మహి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అతను క్రికెట్ వర్గాలకు సుపరిచితుడయ్యాడు. ఇప్పటికే భారత్, పాక్ క్రికెటర్లంతా సుశాంత్ అకాల మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. త్వరగా వెళ్లిపోయావ్ మిత్రమా అంటూ బాధపడ్డారు.
తాజాగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షేన్ వాట్సన్ సుశాంత్ మృతిపట్ల ట్విటర్ వేదికగా నివాళులు అర్పించాడు. చక్కని ప్రతిభ కలిగిన నటుడు త్వరగా కనుమరుగైపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 'సుశాంత్ ఆత్మహత్య గురించి ఆలోచించడం ఆపలేకపోతున్నా. ఇది చాలా విషాదకర ఘటన. ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ సినిమా చూస్తూంటే నటిస్తోంది ధోనియా, లేక సుశాంతా? అని మర్చిపోయి చూసేంత.. అద్భుతంగా నటించాడు. అంతలోనే ఈ ప్రపంచాన్ని ఒంటరి చేసి వెళ్లిపోయాడు. గొప్ప ప్రతిభ త్వరగా కనుమరుగైంది'అని వాట్సన్ ట్వీట్ చేశాడు.
ఇక డిప్రెషన్ కారణంగా 34 ఏళ్ల సుశాంత్ ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇక ధోనీ బయోపిక్ కోసం క్రికెట్ శిక్షణ ఇచ్చిన కిరణ్ మోరే సుశాంత్ మృతిపట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశాడు. 'మనం ఒక అందమైన పిల్లాడిని, విద్యావంతుణ్ని, కష్టపడి విజయాన్ని సాధించిన వ్యక్తిని కోల్పోయాం. ధోని సినిమా కోసం 9 నెలలు ప్రొఫెషనల్ క్రికెటర్లా ప్రాక్టీస్ చేశాడు. హెలికాప్టర్ షాట్లో పరిపూర్ణత సాధించాడు. ఎన్ని గాయాలు తగిలినా వికెట్కీపింగ్ కోసం సిద్ధంగా ఉండేవాడు. అద్భుతమైన తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించాడు. నమ్మలేకపోతున్నా.'అని కిరణ్ మోరే ట్వీట్ చేశాడు.