
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. 52 ఏళ్ల షేన్ వార్న్ అకాల మరణం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శోకసంధ్రంలో ముంచింది. ఇక ఆస్ట్రేలియా క్రికెట్లో అయితే పెను విషాధాన్ని మిగిల్చింది. ఒకే రోజు తమ ఇద్దరు లెజెండ్స్ను క్రికెట్ ఆస్ట్రేలియా కోల్పోయింది. ఈ ఉదయమే ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ గుండెపోటుతో మరణించగా.. సాయంత్రం షేన్ వార్న్ తుది శ్వాస విడిచారు.
అయితే షేన్ వార్న్ తన చివరి ట్వీట్లో రాడ్ మార్ష్కు నివాళులర్పించాడు. ఈ రోజు ఉదయం 7.23 గంటలకు ఈ ట్వీట్ చేశాడు. 'రాడ్ మార్ష్ మరణ వార్త కలిచివేసింది. అతనో క్రికెట్ లెజెండ్. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్పూర్తి. క్రికెట్కు రాడ్ విశేష సేవలందించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఎన్నో మెళకువలు నేర్పించాడు. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సహచరుడా రెస్ట్ ఇన్ పీస్'అని ట్వీట్ చేశాడు. ఉదయమే తన సహచర ఆటగాడికి నివాళులర్పించిన షేన్ వార్న్.. సాయంత్రానికి గుండె పోటుతో మరణించడం అభిమానులను కలిచి వేస్తోంది.
షేన్ వార్న్ మరణవార్తను నమ్మలేకపోతున్నామని అభిమానులతో పాటు క్రికెట్ దిగ్గజాలు అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా లెజండరీ స్పిన్నర్కు నివాళులర్పిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు భారత ఆటగాళ్లు, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు వార్న్కు నివాళులర్పిస్తూ.. అతనితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
కాగా 1992 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా తరపున 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు సాధించాడు. ఇందులో ఐదు వికెట్ల ఘనతను 37 సార్లు, 10 వికెట్ల ఘనతను 10 సార్లు అందుకున్నాడు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. 1992లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన షేన్ వార్న్.. 2007లో వీడ్కోలు పలికాడు. 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సేవలందించాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా చరిత్రకెక్కాడు. వార్న్ కంటే ముత్తయ్య మురళీ ధరన్(800) ముందున్నాడు. సచిన్-వార్న్, లారా-వార్న్ పోరాటం క్రికెట్ అభిమానులను ఎంతో అలరించింది.