
సిడ్నీ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ మరో రెండు రోజుల్లో మొదలవ్వనుంది. గురువారం జరిగే పింక్ బాల్ మ్యాచ్తో ఈ మెగా సిరీస్ షురూ కానుంది. కోహ్లీ సేన విదేశాల్లో ఆడే తొలి డే/నైట్ మ్యాచ్ ఇదే కావడం.. పైగా ఫస్ట్ టెస్ట్ తర్వాత విరాట్ అందుబాటులో ఉండకపోవడంతో ఈ హై ఓల్టేజ్ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే గత పర్యటనలో భారత్ గెలిచినప్పటికీ తాజా సిరీస్లో మాత్రం ఆస్ట్రేలియానే గెలుస్తుందని ఆ దేశ దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ అన్నాడు. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో స్పోర్ట్స్ తక్తో మాట్లాడిన ఈ ఆసీస్ లెజెండ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'కొన్నేళ్ల క్రితమే ఆసీస్లో భారత్ టెస్ట్ సిరీస్ నెగ్గాల్సింది. ఎందుకంటే అది మంచి జట్టు. విజయానందుకోవడానికి కావాల్సిన అర్హత ఆ జట్టుకు ఉంది. ఈ తరంలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్మన్. క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ అతి ముఖ్యమైనది. ఫస్ట్ క్లాస్ క్రికెట్కే కట్టుబడి ఉన్న బీసీసీఐకి అభినందనలు. దాంతో ఆటగాళ్లంతా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సత్తా చాటి జట్టులో చోటు దక్కించుకుంటున్నారు. నేను భారత్లో ఆడేటప్పుడు అక్కడ ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడేవారు. వాస్తవానికి టీ20లకు చోటేలేదు. టెస్ట్ల శకంలో కాకపోయినా ఇప్పుడు భారత్ జట్టు అత్యుత్తమమైనది. ఐపీఎల్తోనే ఇది సాధ్యమైందనేది నా అభిప్రాయం.
అంతర్జాతీయ పేసర్లంతా ఐపీఎల్ ఆడటం వల్ల సత్తా ఉన్న యువ బ్యాట్స్మన్ ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. భారత్ కూడా చాలా మంది పేసర్లను తయారు చేస్తోంది. అప్కమింగ్ టెస్ట్ సిరీస్ కోసం నేను ఆతృతగా ఎదురు చూస్తున్నా. అయితే ఈ సిరీస్లో ఆస్ట్రేలియానే గెలుస్తదని నా మనసు చెబుతుంది. విరాట్ కోహ్లీ ఒకే మ్యాచ్ పరిమితం అవ్వడం కూడా ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశమే. ఈ సిరీస్ ఆసీస్ 2-1తో నెగ్గుతుందనేది నా అంచనా'అని షేన్ వార్న్ జోస్యం చెప్పాడు.